CPl Narayana : సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు పెంచడం గురించి తరచూ వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమా విడుదల అయ్యే ముందు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ అనుమతులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కొందరు ఇలా టికెట్ల రేట్లు పెంచడానికి పూర్తిగా తప్పు పడుతున్నారు. సినిమా చేయటం కోసం నిర్మాతలు విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తూ ఆ భారం మొత్తం ప్రజలపై వేయటం వల్ల చిత్ర పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టాలను ఎదురుకుంటుందని పలువురు ఈ విషయం పై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలన్నింటికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ రాజకీయ నాయకుడు సిపిఐ నారాయణ సంక్రాంతి సినిమాలకు టికెట్లు రేట్లు పెంచడం గురించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ విషయంపై స్పందించి విమర్శలు కురిపించిన నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
“సినీ మాఫియా, ప్రభుత్వాలు ప్రజలను లూటీ చేస్తున్నాయని సినిమా వాళ్ళు సిగ్గు లేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయి. వందల కోట్లు ఖర్చుపెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారు? సినిమా చూడటం కోసం ప్రజలు వెళితే వాటర్ బాటిల్, బిస్కెట్లు కూడా లోపలికి తీసుకెళ్లనివ్వరు” అంటూ ఈయన సినిమా ఇండస్ట్రీపై అలాగే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు కురిపించారు. ఇలా ప్రతి సినిమాకి టికెట్ ధరలు పెంచడం వల్ల సాధారణ ప్రేక్షకులకు అది భారంగా మారుతుందని ఈయన అభిప్రాయపడ్డారు. ఇలా సినిమా టికెట్లు రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కు దూరమవుతున్నారని తెలిపారు.
ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారు..
గతంలో కూడా ఈయన సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా రేట్లు పెంచడం వల్లే ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తున్నారని అలాంటి వారిని ఇండస్ట్రీనే పెంచి పోషిస్తుంది అంటూ సిపిఐ నారాయణ గతంలో కూడా సినిమా టికెట్ల రేట్ల గురించి స్పందించారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా వరుస సినిమాలకు రేట్లు పెంచడంతో ఈయన మరోసారి ఈ విషయంపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ మండిపడ్డారు. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభాస్ ది రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన దక్కించుకుంది.
Also Read: Bandla Ganesh: కాసేపట్లో మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్.. బండ్ల ట్వీట్ వైరల్!