Divvela madhuri: ఏపీ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ నిత్యం వార్తల్లో నిలిచే దివ్వెల మాధురి ఇప్పుడు టాలీవుడ్ తెరపైకి వస్తున్నారు. ‘చీన్ టపాక్ డుం డుం’ అనే వెరైటీ టైటిల్తో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె ఒక పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన మాధురి, ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సలహాతో ఈ పాత్రను ఎంచుకున్న ఆమె, ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ..ఆ వివరాలు చూద్దాం..
వై.ఎన్. లోహిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మాధురి ‘గైరమ్మత్త’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ గురించి ఆమె మాట్లాడుతూ.. “చాలామంది నన్ను గయ్యాలి అనుకుంటున్నారు కదా, అందుకే ఈ గయ్యాలి అత్త పాత్ర త్వరగా జనాల్లోకి వెళ్తుందని ఎంచుకున్నాను” అని చమత్కరించారు. సీనియర్ నటి తెలంగాణ శకుంతలని గుర్తు చేసేలా ఈ పాత్ర ఉండబోతోందని సమాచారం. ఈ లుక్ చూస్తుంటే మాధురి గంభీరమైన నటనతో ఆకట్టుకోబోతున్నట్లు అర్థమవుతోంది.
సినిమా ఆఫర్లు బిగ్ బాస్ తర్వాత చాలా వచ్చినా, దువ్వాడ శ్రీనివాస్ గైడెన్స్తోనే ఈ కథను ఎంచుకున్నట్లు మాధురి తెలిపారు. షూటింగ్ సెట్లో కూడా శ్రీనివాస్ ఉండి ఆమెను ప్రోత్సహిస్తున్నారు. “మంచి కథతోనే ఎంట్రీ ఇవ్వాలని వెయిట్ చేశాం. ఈ విలేజ్ నేటివిటీ రోల్ నాకు ప్రత్యేక గుర్తింపు తెస్తుందని నమ్ముతున్నాను” అని ఆమె పేర్కొన్నారు. గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ హీరోయిన్ సమంత క్లాప్ కొట్టడం విశేషం.
దివ్వెల మాధురి పేరు వినిపిస్తే చాలు వివాదాలు కూడా వెంటే ఉంటాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న అనుబంధంతో వార్తల్లో నిలిచిన ఆమె, తిరుమల పర్యటనలో చేసిన రచ్చ రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది. తిరుమలలో ఫోటోషూట్ చేయడమే కాకుండా, తన స్నేహితురాలు తనూజ పుట్టినరోజు వేడుకలను కేక్ కటింగ్తో జరపడం పెద్ద వివాదానికి దారితీసింది. టీటీడీ నిబంధనలను అతిక్రమించారంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి, తన అగ్రెసివ్ తీరుతో ‘ఫైర్ బ్రాండ్’ అనిపించుకున్నారు. తోటి కంటెస్టెంట్లతో గొడవలు, హౌస్ లో ఆమె ప్రవర్తనపై నాగార్జున కూడా క్లాస్ పీకడంతో ఆమె ప్రయాణం కేవలం మూడు వారాలకే ముగిసింది. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
డ్యాన్సర్, బిజినెస్ ఉమెన్, ఇప్పుడు యాక్టర్.. ఇలా మాధురి ప్రయాణం ఎటు వెళ్తోందని అడగ్గా, ఆమె చాలా క్లారిటీ ఇచ్చారు. “ఒక స్త్రీ అన్నింటినీ మేనేజ్ చేయగలదు. నేను బిజినెస్ చూసుకుంటాను, యాక్టింగ్ చేస్తాను.. కానీ 100% రాజకీయాల్లోనే ఉంటాను” అని తన భవిష్యత్తు ప్రణాళికను బయటపెట్టారు. ఒకవేళ ఈ సినిమాలో తన నటన జనాలకు నచ్చితేనే సినిమాలు కొనసాగిస్తానని, లేదంటే ఆపేస్తానని స్పష్టం చేశారు.
also read:దొంగగా మారిన ధనుష్.. కర సెన్సార్ టాక్.. మెప్పించాడా?
మాధురి సినీ ప్రయాణం ఒక్క సినిమాకే పరిమితం కాలేదు. ‘ఫలానా వారి అబ్బాయి’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్లోనూ ఆమె నటిస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా నటిస్తుంటే, ఆయన పక్కన మాధురి ఆయన భార్య పాత్రను పోషిస్తున్నారు. అంటే రియల్ లైఫ్ జోడీని ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా చూడబోతున్నామన్నమాట.
వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా తన పని తాను చేసుకుంటూ పోయే మాధురి, ఇప్పుడు వెండితెరపై ‘గైరమ్మత్త’గా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. గ్రామీణ నేపథ్యం, రాజకీయ సటైర్స్ కలగలిసిన ఈ సినిమా మే లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తనదైన మేనరిజంతో మాధురి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో వేచి చూడాల్సిందే!