ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించిన స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానమంటేనే నేతలు జంకుతున్నారు. ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటి వరకు పోటీ చేసి గెలిచిన వారెవరూ నిలకడగా లేరు. పదవీ కాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిందీ లేదు. ఏదో ఒక చిక్కు. వివాదం. కోర్టు కేసులు. రాజకీయ వివాదాలు…రాజీనామాలు.. ఇలా ఆ పదవికి ఓ గండంలా ఏదో ఒకటి అడ్డు పడుతూనే ఉన్నాయి. తాజాగా కవిత రాజీనామాతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. ఆమె రాజీనామా చేసి కూడా ఆరు నెలలు కావొస్తోంది. ఇంకా నోటిఫికేషన్ వేయలేదు. దీనికి కారణమూ లేకపోలేదు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. పాల్గొంటారు. వారే ఓటేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కానీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు. దీంతో ఇవి పూర్తైతే గానీ ఈ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయలేని పరిస్థితి. త్వరలో వీటిని నిర్వహించాలని సర్కార్ అన్నీ రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ గెలుపు సునాయసమే కానుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించింది కాంగ్రెస్. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీదే పైచేయి కానుంది. ఈ క్రమంలో ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడనుంది.
అయితే ఎవరికి ఇది ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో చాలా మందికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఉన్నారు. దీంతో అందులో ఎవరికైనా ఇద్దామనే ఆలోచనకు వచ్చారు. కానీ ఈ సీటు చరిత్ర తెలుసుకున్న వాళ్లంతా వామ్మో ఆ ఎమ్మెల్సీనా? అని భయపడుతున్నారట. ఇది ప్రారంభం నుంచే అన్నీ అవంతరాలు.. రాజీనామాల నడుమ సాగిన పదవిగా అలా ముద్రపడి పోయింది రాజకీయంగా. తొలత దీన్ని టీడీపీ నుంచి బోధన్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మహ్మద్ షకీల్కు చాన్స్ ఇచ్చారు. అతను గెలిచేవాడే. కానీ కౌంటింగ్ ముందే నకిలీ పాసుపోర్టుల కేసులో షకీల్ను అరెస్టు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం షకీల్ను తమ పార్టీ వాడు కాదని యూటర్న్ తీసుకున్నది.
దీంతో షకీల్పై ప్రత్యర్థి వెంకట్రాంరెడ్డి 9 ఓట్లతో గెలిచాడు. లక్కీ డ్రాలో ఆయనకు రెండేళ్లే చాన్సు వచ్చింది. అలా అదృష్టం వరించినా.. ఇలా రెండేళ్లకే సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత అరికెల నర్సారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. మళ్లీ వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ బరి నుంచి దిగాడు. ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడని జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న డీఎస్ ప్రకటించడం కలకలం రేపింది. అధికారులు కాకుండా డీఎస్ ప్రకటించడాన్ని ఆక్షేపిస్తూ అరికెల రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఒక్క ఓటుతో అరికెల గెలిచాడు.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో ఇది దాదాపు ఆరేళ్లుగా కేసు కొనసాగింది. చివరగా ఆరు నెలల ముందు కోర్టు సమక్షంలోనే కౌంటింగ్ నిర్వహించడం.. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడం.. టాస్ వేస్తే అరికెలకే అదృష్టం వరించడంతో ఆయన పూర్తి పదవీ కాలం ఇలా వివాదాల మధ్య పూర్తయ్యింది. ఆ తరువాత దీన్ని బీఆరెస్ నుంచి భూపతిరెడ్డికి (ప్రస్తుత నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే) ఏకగ్రీవం చేశారు. కానీ పార్టీ విధానాలపై తిరుగుబాటు చేయడంతో ఆయనను తప్పించారు. ఉప ఎన్నిక ద్వారా కవితకు అవకాశం కల్పించారు. ఆ మిగిలిన టర్మును కవిత పూర్తి చేశారు. మళ్లీ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవితకే చాన్స్ ఇచ్చారు.
ఆమె గెలిచినా తరువాత ఆమె జైలుకు వెళ్లడం తదనంతర పరిణామాల మధ్య పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం.. ఆమె రాజీనామా చేయడంతో ఇప్పుడు మళ్లీ ఖాళీ అయ్యింది. ఈ ఏడాది డిసెంబర్తో దీని టర్ము పూర్తి కానుంది. ఆలోపు నోటిఫికేషన్ వేసి ఎమ్మెల్సీ సీటును భర్తీ చేయాలని భావిస్తోంది సర్కార్.