Tollywood:చిత్రసీమలో ఒకవైపు శుభవార్తలు మరొకవైపు అశుభవార్తలు అభిమానులను అతలాకుతలం చేస్తున్నాయి. ఎంతో ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నీషియన్స్ తనువు చాలుస్తుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా గుండెపోటు అనే మహమ్మారి వ్యాధి బారినపడి అతి చిన్న వయసులోనే తనువు చాలించడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ ఎడిటర్ చిన్న వయసులోనే గుండెపోటు బారినపడి తుది శ్వాస విడిచారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ సెలబ్రెటీలు విషాదం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఎవరో కాదు ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కరీంనగర్ కి చెందిన ఈయన.. హైదరాబాదులోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పని చేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక మధు రెడ్డి విషయానికి వస్తే.. ఎడిటర్ గా ఈయనకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. సినిమాలోని రిథమ్, ఎమోషన్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు కూడా ఉంది.
అలా అహ నా పెళ్ళంట, జగమే మాయ, దక్ష, దళం, వాలెంటైన్స్ నైట్ వంటి చిత్రాలతో పాటు అగ్ని నక్షత్రం వంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసే విధానాన్ని మనకు తెలియజేస్తాయి. ఒక్క ఫీచర్ ఫిల్మ్స్ కి మాత్రమే కాకుండా వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్ గా కూడా ఆయన పనిచేశారు.
ALSO READ:21 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టబోతున్న సిద్ధార్థ్ – త్రిష.. డైరెక్టర్, నిర్మాత ఎవరంటే?
అంతేకాదు జగడం, జల్సా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది కూడా ఈయనే.. పైగా ఈ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్కు ఎంతో ఉందని చెప్పాలి. తన వృత్తిపట్ల అంకిత భావం.. ఎప్పుడూ ఒదిగి ఉండే మనస్తత్వం ఆయన సొంతం. అలాంటి ఒక గొప్ప ఎడిటర్ అతి చిన్న వయసులోనే అది కూడా గుండెపోటు వచ్చి మరణించడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక భౌతికంగా మధు రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తు ఉండిపోతారనటంలో సందేహం లేదు. మధు రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.