Nageswara Rao: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ సమావేశంపై స్పందిస్తూ.. అది బర్త్ డే పార్టీయో లేక ప్లీనరీయో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాల అహంకారం వల్ల రాష్ట్రం రావణకాష్టంగా మారిందని, ప్రజలు అష్టకష్టాలు పడ్డారని తుమ్మల మండిపడ్డారు.
ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేకపోయారని, కేవలం కమిషన్ల కోసమే కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని విమర్శించారు. ‘సీతారామ ప్రాజెక్టు నా జీవితాశయం. నేను లేని సమయంలో హడావుడిగా ప్రారంభించి దాన్ని నిర్వీర్యం చేశారు’ అని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, జూన్ నాటికి 16 వేల ఎకరాలకు, ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో 10 వేల ఎకరాలకు నీరు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
హరీష్ రావు వ్యక్తిగత , రాజకీయ స్థితిగతులపై కూడా తుమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఎక్కడికి వెళ్లినా పాత ‘ఆవు కథ’నే చెబుతుంటారని, సొంత పార్టీలోనే ఆయనకు గుర్తింపు లేదని విమర్శించారు. వరంగల్ మీటింగ్ లో కనీసం ఆయన ఫోటో కూడా లేకపోవడాన్ని తుమ్మల గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతిమయం చేసి, రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టేసిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
రుణమాఫీపై మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం 21 వేల కోట్లు జమ చేసిందని, దీనిపై విమర్శలు చేయడం హరీష్ రావు మానసిక స్థితికి నిదర్శనమని తుమ్మల అన్నారు. కబ్జా చేసిన స్థలాల్లో మీటింగ్లు పెట్టుకుంటూ, అవినీతిపరులను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే మాటలను ప్రజలు నమ్మరని కొట్టిపారేశారు. ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజల పక్షాన నిలిచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు.
Also Read: టార్గెట్ రిచ్ గర్ల్స్.. ప్రేమ పేరుతో 13 లక్షలు నొక్కేసి చివరకు ..