Kittu Pawan:తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇపుడు సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఎం.ఎస్ వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్లోని మాదాపూర్ శివమ్ మీడియా కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
తెలంగాణా నేటివిటీతో తెరకెక్కనున్న ఈ సినిమాకి దిలీప్ నాయక్ దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాతలు ముని శివ మరియు శివ మల్లాల ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడానికి సిద్దం అవడం విశేషం.
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలెబ్రిటీలు వచ్చి తమ విషెస్ ని తెలిపారు.ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ హీరో కిట్టుపై చిత్రీకరించిన మొదటి షాట్కు క్లాప్ కొట్టగా, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఇక మొదటి షాట్కు ప్రముఖ సంగీత దర్శకుడు, దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ గౌరవ దర్శకత్వం వహించగా, జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న మరియు ‘బుల్లెట్ బండి’ ఫేమ్ లక్ష్మణ్ కలసి దర్శకుడు దిలీప్కు పవిత్రమైన స్క్రిప్ట్ను అందజేశారు
ఈ సందర్భంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ మాట్లాడుతూ, ఈ మూవీ టీమ్ తనకి ఎప్పటి నుండో బాగా పరిచయం అని,ముఖ్యంగా నిర్మాతలు ముని శివ, శివ మల్లాలలతో పాటు బుల్లెట్ బండి లక్ష్మణ్, సంగీత దర్శకుడు మదిన్ తనకు ఎంతో ఆత్మీయులని, ఈ ప్రాజెక్ట్తో వీరందరూ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని తన విషెస్ అందించారు.
ఇక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ, ఒక బలమైన, మంచి కథతో వచ్చిన దిలీప్కు నిర్మాతలు శివలిద్దరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నారని, కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధిస్తాయని సినిమా పట్ల తనకున్న కాన్ఫిడెన్స్ ని వ్యక్తపరిచారు.
ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ ఇద్దరు నిర్మాతలు ముందు ముందు మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ గా ఎదగాలని ఆకాంక్షించారు.
ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఫోక్ స్టార్ కిట్టు మాట్లాడుతూ యూట్యూబ్లో చిన్న చిన్న జానపద పాటలు చేసుకునే తనకు ఈ స్థాయిలో ప్రోత్సాహం అందించడానికి ఇండస్ట్రీలోని ఇంతమంది పెద్దలు రావడం మర్చిపోలేని అనుభూతి అని ఎమోషనల్ అయిపోయారు. ఇక ఇంతటి పెద్ద అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.
ఇక ఈ చిత్రానికి మదిన్ సంగీతం అందిస్తుండగా జనతా బబ్లూ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నూతన దర్శకుడు కృష్ణకాంత్తో పాటు తెలంగాణ జానపద రంగానికి చెందిన పలువురు ప్రముఖ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేయడం విశేషం.