Godavari Pushkaralu: స్వేచ్చ బ్యూరో: గోదావరి పుష్కరాలు – 2027 కు మూడు విడతల నిర్మాణ పనుల్లో తొలి విడుత పనులకు శనివారం శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. తొలి విడత పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.46.65 కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. రెండో విడత పనులకు రూ. 1.75 కోట్లు, మూడో విడత పనులకు రూ. 60 లక్షలు మొత్తం రు.49కోట్లతో ఈ పుష్కర ఘాట్ పనులు కొనసాగుతాయని తెలిపారు. వచ్చే ఈడాది మార్చి నెల లోపు ఈ పనులన్నీ పూర్తి కానున్నాయని వెల్లడించారు.
గోదావరి నది ఆయకట్టు పరివాహక ప్రాంతంలో పుష్కర ఘాట్ నిర్మాణానికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ పాల్గొన్నారు. వేద పండితులు పూజలు నిర్వహించారు. మొదట భద్రాచలంలో పుష్కర ఘాట్ పనులు, దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల, బూర్గంపహాడ్ మండలంలో మోతే పట్టి నగర్ ప్రాంతాలలో పుష్కర ఘాట్ పనులు కొనసాగుతాయన్నారు. తుది దశలో ములుగు జిల్లాలోని చిన్నరావిగూడెం, రామానుజావరం, రామచంద్రాపురం ప్రాంతాలలో పుష్కర ఘాట్ పనులు జరగనున్నాయని తెలిపారు.
Also read: ఈ రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ పక్క దేశానికి వెళ్లిపోవచ్చు!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో వచ్చే ఏడాది 2027 జూన్, జూలై నెలలో నిర్వహించే గోదావరి పుష్కరాల భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పనులు నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అధికారులకు సూచించారు. సరిహద్దు ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం ప్రాంతాలలో ఈ పుష్కర ఘాట్ పనులు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధి మరమ్మత్తు పనులు రు. 351 కోట్లతో కొనసాగుతున్నాయని అన్నారు. దేవాలయ మరమ్మత్తు పనులను సమీక్షిస్తూ వేగవంతంగా పూర్తిచేయాలన్నారు.
గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తిచేసేలా భద్రాచలం కరకట్ట ప్రాంతంలో సర్వీస్ రోడ్డుఏర్పాటు చేసేలా ఆర్. అండ్. బి అధికారులు ప్రణాళిక చేపట్టాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం స్నానాల ఘాట్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భద్రాచలం టెంపుల్ ఈ.వో దామోదర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుడగం శ్రీనివాస్, పంచాయతీ ఈ.వో శ్రీనివాస్, తహసీల్దార్ రవి, ఇరిగేషన్ సీ.ఈ శ్రీనివాస్ రెడ్డి,ఎస్.ఈ మహేశ్వర రావు, డీ.ఈ సబ్ డివిజన్ -1 భాగ్యరాజ్ రాధోడ్, ఈ.ఈ జానీ, వార్డు సభ్యులు సుబ్భా రావు, స్థానికులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, ఏ.ఈ.ఈ రవితేజ తదితరులు పాల్గొన్నారు.