Lokesh Kanagaraj: కోలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు.. ముఖ్యంగా ఖైదీ .. విక్రమ్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. అయితే గత కొంతకాలంగా ఖైదీ 2 గురించి స్పష్టత లేకపోవడంతో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో.. ఇండస్ట్రీలో వినిపించాయి.
ఇటీవల పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్తో లోకేష్ కనగరాజ్ సినిమా అధికారికంగా ప్రకటించబడిన తర్వాత..ఖైదీ 2 పూర్తిగా రద్దయ్యిందని కొందరు ప్రచారం చేశారు. ఎక్కువ రెమ్యునరేషన్ కోసం లోకేష్, ఖైదీ 2ను పక్కన పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై లోకేష్ తొలిసారి స్పందించారు.
ఈ రూమర్లన్నింటినీ ఖండించిన లోకేష్, ఖైదీ 2 ఖచ్చితంగా ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్తో చేసే సినిమా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అని, అది పూర్తయిన తర్వాతే ఖైదీ 2 మొదలవుతుందని తెలిపారు. డబ్బుల కోసం ఖైదీ 2ను వదిలేశానన్న మాటల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు.
తన లొకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడుతూ, ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు అన్నీ ప్లాన్లోనే ఉన్నాయని, ఏ పరిస్థితిలోనైనా అవి పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆలస్యం కావడానికి కారణం హీరో కార్తి ఇతర సినిమాలతో బిజీగా ఉండడమేనని వివరించారు.
రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్ సినిమాపై కూడా లోకేష్ మాట్లాడారు. ఆ ఇద్దరికీ యాక్షన్ కథ రాసానని, కానీ వారు లైట్ హార్ట్డ్ సినిమా కోరుకున్నారని చెప్పారు. తాను అలాంటి సినిమా చేయలేనని నిజాయితీగా చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని తెలిపారు.
ఇక ఈ దర్శకుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుకోగా.. ఈమధ్య రజినీకాంత్ తో చేసిన కూలి సినిమా మాత్రం అనుకున్నంత విజయం తెచ్చి పెట్టలేక పోయింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న తరుణంలో కేవలం యావరేజ్ గా మాత్రమే నిలిచింది. కూలీ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా.. ఖైదీ 2పై ప్రేక్షకుల్లో ఇప్పటికీ భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ సినిమా తర్వాత లోకేష్ నిజంగా ఖైదీ 2పై ఫోకస్ పెడితే, ఆ సినిమా చుట్టూ మళ్లీ భారీ హైప్ ఏర్పడటం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ALSO READ: Dhurandhar Actor Arrest: బుక్కైన దురంధర్ నటుడు.. పనిమనిషిపై అత్యాచారం, ఆపై అరెస్ట్