Karan Johar:ఈమధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలను సామాన్యులే కాదు ఈ – కామర్స్ వెబ్సైట్స్ కూడా అనుమతి లేకుండా ఫోటోలను ఉపయోగిస్తూ.. వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు బాధిత సెలబ్రిటీలు ఏకంగా కోర్టును ఆశ్రయిస్తూ.. తమకు న్యాయం చేయాలి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) తమ వ్యక్తిగత గోప్యతకు భద్రత కల్పించాలి అని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా వచ్చి చేరారు. తాజాగా ఆయన తన వ్యక్తిగత సమాచారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
హైకోర్టును ఆశ్రయించిన కరణ్ జోహార్..
అసలు విషయంలోకి వెళితే.. కరణ్ జోహార్ తన వ్యక్తిత్వం అలాగే ప్రచార హక్కులను కాపాడుకోవాలని కోరుతూ.. సెప్టెంబర్ 15న అనగా నేడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన ఫోటోలను, పేరును అలాగే తన వాయిస్ ను ఎవరూ వాడుకోకుండా చూడాలని అభ్యర్థించారు. అంతేకాదు తన ఫోటోని ఇతర ఈ- కామర్స్ వెబ్సైట్లు టీ షర్టులపై ముద్రించడం లాంటివి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతూ.. ఆయన కోర్టును కోరడం జరిగింది. ఈ పిటిషన్ జస్టిస్ మన్మీత్ పిఎస్ ఆరోరా ముందు విచారణకు వచ్చింది. దీంతో ఆయన కరణ్ జోహార్ తరఫు న్యాయవాది నుండి కొన్ని వివరణలు కోరుతూ తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది.
తదుపరి విచారణ సాయంత్రానికి వాయిదా..
ఇదే విషయంపై కరణ్ జోహార్ మాట్లాడుతూ..” నా వ్యక్తిత్వాన్ని.. నా ముఖాన్ని.. గొంతును ఎవరు అనధికారికంగా ఉపయోగించుకోకుండా చూసుకోవడానికి నాకు హక్కు ఉంది. దయచేసి నా వ్యక్తిగత హక్కులకు భద్రత కల్పించాలని”.. కరణ్ జోహార్ కోరినట్టు.. ఈయన తరఫు న్యాయవాది రాజశేఖర్ రావు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ పిటిషన్ ని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేయగా.. తదుపరి విచారణలో కరణ్ జోహార్ కు ఎలాంటి న్యాయం చేకూరుతుందో చూడాలి.
ఈ జాబితాలో ఐశ్వర్యరాయ్ కూడా..
ఇకపోతే వ్యక్తిగత, సమాచార హక్కులను కాపాడుకోవడానికి ఇటీవల ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి కోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈమె పిటిషన్ ను పరిశీలించిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఐశ్వర్యరాయ్ ఫోటోలను ఎక్కడ ఉపయోగించకూడదని.. అనధికారికంగా ఉపయోగిస్తే కఠిన శిక్షతోపాటు జరిమానా కూడా విధించబడుతుంది అని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరణ్ జోహార్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయారు. మరి ఈ జాబితాలోకి మునుముందు ఇంకా ఎంతమంది సెలబ్రిటీలు వచ్చి చేరుతారో చూడాలి. ఏది ఏమైనా కొంతమంది ఈ సెలబ్రిటీల పేర్లను ఫోటోలను వాడుకొని, వారి పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ఈమధ్య ఎక్కువగా ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్ లో కూడా ఉపయోగించుకోవడం నిజంగా బాధాకరమని చెప్పాలి. మరి దీనిపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
ALSO READ:Kotha Lokah: ఊచకోత కోస్తున్న కొత్తలోక.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?