Keerthy Suresh:చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh). తెలుగులో ‘మహానటి’ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. అలాంటి ఈమె తాజాగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు దక్కించుకోవడంతో ఈ శుభ సందర్భంలో ఆయన లేకపోవడం మరింత బాధగా ఉంది అంటూ ఒక ఎమోషనల్ పోస్టు పంచుకుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
2016 నుండి 2022 సంవత్సరాలకు గానూ తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవం వేడుక 2026 ఫిబ్రవరి 13న చెన్నైలో చాలా ఘనంగా జరిగింది. ఈ జాబితాలో సూర్య (సూరారై పొట్రు), ధనుష్ (వడ చెన్నై), విజయ్ సేతుపతి, కార్తీ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకోగా.. జ్యోతిక, నయనతారతో పాటు మహానటి కీర్తిసురేష్ కూడా ఉత్తమ నటి విభాగంలో పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈమె నటించిన ‘పాంబు సట్టై’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్.. ఈ అవార్డు రావడంపై సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది.
కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ అవార్డు అందుకున్న ఫోటోలను పంచుకుంటూ..” నాకు మొదటి రాష్ట్ర అవార్డు ఇచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా తొలి తమిళ్ చిత్రం నుంచి నన్ను ఆదరిస్తున్న రాధిక మ్యామ్, శరత్ కుమార్ సార్ లకు ధన్యవాదాలు. కానీ ఈరోజు మనోబాల సార్ మా మధ్య లేకపోవడం నన్ను ఎంతగానో బాధపెడుతోంది. ఆయన ఇక్కడ ఉంటే ఆ ఆనందం ఇంకోలా ఉండేది.” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కీర్తి సురేష్. ఇక మనోబాల మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో కలచివేసింది అని ఆమె తన ఇంస్టాగ్రామ్ పోస్టులో పంచుకొచ్చింది.
ALSO READ:Lokesh Kanagaraj: హీరోగా మారిన ఖైదీ దర్శకుడు.. ‘డీసీ’ గ్లింప్స్ రిలీజ్!
కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఒక తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా వరుస ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా ఉప్పుకప్పురంబు సినిమాతో ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేష్.. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన్ అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించారు.. అలాగే హిందీలో కూడా బేబీ జాన్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈమెకు ఆ సినిమా విజయాన్ని అందించలేదు.. ఇప్పుడు మరో సినిమాలో ఈమె అవకాశం అందుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పాత్రలో కృతి శెట్టి నటించాల్సి ఉండగా.. ఆమెకు బదులుగా కీర్తి సురేష్ ని తీసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.