FEFSI:తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె వాతావరణం నెలకొంటోంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చిత్రాల షూటింగ్లు, విడుదలలతో పాటు అన్ని రకాల సినీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయంపై దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సమ్మె వల్ల వేలాది మంది రోజువారీ వేతన కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయని హెచ్చరిస్తూ, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి, నిర్మాతల మండలికి విజ్ఞప్తి చేసింది..
నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నామని, కానీ ఇలా ఏకపక్షంగా పరిశ్రమను స్తంభింపజేయడం సరైన మార్గం కాదని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె. సెల్వమణి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి పనులు నిలిపివేయాలనే నిర్ణయాన్ని నిర్మాతల మండలి పునఃపరిశీలించాలని కోరారు. సమ్మె అనేది సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ శాశ్వత మార్గం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ బంద్ అమలులోకి వస్తే సినీ పరిశ్రమపైనే ఆధారపడి బతుకుతున్న దాదాపు 10,000 మందికి పైగా రోజువారీ వేతన కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతాయని ఫెఫ్సీ ఆవేదన చెందింది. ఇక అంతేకాకుండా ఈ షట్డౌన్ వల్ల మొత్తం ఇండస్ట్రీకి సుమారు రూ. 500 కోట్ల వరకు ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాతల మండలి, థియేటర్ యజమానులు, కార్మిక సంఘాలతో త్రైపాక్షిక చర్చలు జరపాలని ఫెఫ్సీ విజ్ఞప్తి చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సినీ ప్రముఖులను చర్చలకు పిలవాలని కోరింది.ఇక గతంలో 2023లో 45-50 రోజుల పాటు జరిగిన సమ్మె సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని, ఈసారి నిర్ణయాలకు కచ్చితమైన గడువు విధించి అమలు చేసేలా చూడాలని పేర్కొంది.
also read:‘ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!
సమ్మె కొనసాగితే నిర్మాతలు, కార్మికులు, మొత్తం తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని ఫెఫ్సీ హెచ్చరించింది. ఇక షూటింగ్లు ఆపేసి తర్వాత చర్చలు జరపడం కంటే, ముందే అన్ని వర్గాలు ఒకే వేదికపైకి వచ్చి సంప్రదింపుల ద్వారా సానుకూల పరిష్కారం కనుగొనాలని, తద్వారా వేలాది మంది కార్మికుల భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటోంది.