Manchu Lakshmi: మంచు వారసురాలు మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం లక్ష్మీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే రెండేళ్ల క్రితం మంచు లక్ష్మీ టాలీవుడ్ ను, హైదరాబాద్ ను వదిలి ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడే బాలీవుడ్ లో ఆమె పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఇక ఈ మధ్యనే మంచు లక్ష్మీ నటించిన దక్ష సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 19న మంచు లక్ష్మీ, మోహన్ బాబు కలిసి నటించిన దక్ష ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మంచు లక్ష్మీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.
గత కొంతకాలంగా మంచు కుటుంబంలో వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములు అయిన విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి వివాదాలు రోడ్డెక్కిన విషయం కూడా విదితమే. అయితే మంచు కుటుంబం రోడ్డెక్కి వివాదాల పాలైన సమయంలో వారసురాలైన మంచు లక్ష్మీ సైలెంట్ గా ఉండడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె హైదరాబాద్ లో ఉండడం లేదు కాబట్టి ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు అని సైలెంట్ గా ఉంది అని చాలామంది అనుకున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది. ఈమధ్య మీ కుటుంబంలో చాలా గొడవలు జరిగాయి. దానివల్ల మీరు ఎక్కువ నలిగిపోయారని తెలుస్తుంది. అది నిజమేనా..? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మీ మాట్లాడుతూ..” ఏ కుటుంబంలోనైనా సమస్యలు వచ్చినప్పుడు అందరూ నలిగిపోతారు. నలగకుండా ఉన్నారు అని చెప్పడం అబద్ధం. మేముండేది అద్దాలమేడలో.. మేము ఏం చెప్పినా తల. తోక కట్ చేసి వాళ్లకు నచ్చినట్లు రాసుకునే రోజులు వచ్చేసాయి. అలాంటి రోజుల్లో ఉన్నాం. అందుకే అలాంటప్పుడు సైలెంట్ గా ఉండడమే ఉత్తమం అని నాకనిపించింది. అందుకే మౌనంగా ఉన్నాను.
గతంలో ఏది తప్పు ఏది ఒప్పు అని ఎక్కువ ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. ఈమధ్య రైట్, రాంగ్ అనే దానికన్నా ఏది నన్ను హ్యాపీగా ఉంచుతుందో దానినే చూస్తున్నాను. నేను నీకు ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి అనేది పెట్టుకోవట్లేదు. నువ్వు ఏది రైట్ అంటే అదే రైట్ అని అనేస్తున్నాను. నేనేం చేస్తున్నాను అనేది ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు నాకు లేదు. నాకేదైతే ఎక్కువ ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుందో అదే చేయడం మొదలుపెట్టాను.
జీవితం లో ఏదైనా మనకు ఒక పాఠం నేర్పించడానికి వస్తుంది. అది ఏది జరిగినా మౌనంగా ఆలోచిస్తే అదే మనకు ప్రశాంతతను ఇస్తుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ముంబై వెళ్లాక మంచు లక్ష్మీ ఆలోచనలో, మాట తీరులో చాలావరకు మార్పులు వచ్చాయని.. అంతకు ముందు కన్నా ఆమె ఎంతో మెచ్యూర్డ్ గా మాట్లాడుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.