Dhurandhar Franchise : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ తన షేర్హోల్డర్ల వార్షిక నివేదికలో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జియో స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రూ .3,000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించిందని ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేశారు .
ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీని మునుపెన్నడూ లేని విధంగా శాసిస్తూ, దేశీయ బాక్సాఫీస్ వసూళ్లలో ఏకంగా 40 శాతానికి పైగా వాటాను ఈ ఒక్క ఫ్రాంచైజీయే దక్కించుకోవడం విశేషం. కేవలం రూ.350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలు ఈ స్థాయి గ్లోబల్ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కి గురిచేస్తోంది.
వరుసగా మూడో ఏడాది టాప్ ప్లేస్!
జియో స్టూడియోస్ సాధించిన ఈ అరుదైన విజయంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, “భారతీయ సినీ పరిశ్రమలో వరుసగా మూడు సంవత్సరాల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను అందించిన ఏకైక నిర్మాణ సంస్థగా జియో స్టూడియోస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో ‘స్త్రీ 2’, 2025లో ‘ధురంధర్’, మరియు 2026లో ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలతో తమ తిరుగులేని ఆధిక్యాన్ని, నిలకడను నిరూపించుకుంది” అని ఆకాశానికి ఎత్తేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ వద్దే కాకుండా, రిలీజ్ స్ట్రాటజీ, మానిటైజేషన్ మోడల్స్, మరియు గ్లోబల్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్లో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేశాయని ఆయన పేర్కొన్నారు.
బాక్సాఫీస్ వద్ద వినూత్న ప్రయోగం!
సాధారణంగా ఒక సినిమా సీక్వెల్ రావడానికి ఏళ్ల సమయం పడుతుంది. కానీ జియో స్టూడియోస్ ఒకేసారి రెండు భాగాలను ప్లాన్ చేసి, ఫైనాన్స్ చేసి, షూటింగ్ పూర్తి చేసి అత్యంత తక్కువ వ్యవధిలో విడుదల చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. ‘ధురంధర్’ మొదటి భాగం గత ఏడాది డిసెంబర్లో విడుదలై, ఆల్-టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో ఏకంగా 15 వారాల పాటు నిరంతరాయంగా విజయవంతంగా ప్రదర్శించబడుతూ, సరిగ్గా ఈ ఏడాది మార్చిలో పార్ట్-2 వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద పట్టు కోల్పోలేదు.
భారీ అంచనాల మధ్య రంగంలోకి దిగిన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’.. మొదటి భాగం క్రియేట్ చేసిన రికార్డులను సైతం బద్దలు కొడుతూ సునామీ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇలా రిలీజ్ చేయడంలో పాటించిన స్ట్రాటజీ ఇండియన్ సినిమా ట్రెండ్ నే కాకుండా, సినిమా మార్కెటింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసిందని అంబానీ అభినందించారు.
నంబర్ వన్ కంటెంట్ స్టూడియోగా జియో!
గడిచిన ఎనిమిదేళ్లలో జియో స్టూడియోస్ కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, ప్రేక్షకులతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ టాలీవుడ్, బాలీవుడ్ సహా ప్రాంతీయ భాషల్లో తన ముద్ర వేసింది. ప్రారంభం నుండి నిరంతరం లాభాల బాటలో పయనిస్తూ, క్రియేటివిటీ, స్కేల్, మరియు డిస్రప్షన్కు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ దేశంలోనే నంబర్ వన్ కంటెంట్ స్టూడియోగా అవతరించిందని ఈ వార్షిక నివేదిక స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో జియో స్టూడియోస్ నుండి మరిన్ని భారీ ప్రాజెక్టులు ఇంటర్ నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ రాబోతున్నాయని తెలుస్తోంది.చూడాలి మరి ముందు ముందు అంబానీ వారి ప్రొడక్షన్స్ నుండి ఇంకెన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రానున్నాయో !
also read :స్వయంభూ కోసం ప్రాణం పెట్టిన నిఖిల్.. మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ గ్లింప్స్ వైరల్!