కవిత తన కొత్త పార్టీ ద్వారా కొత్త పోరాట పంథాను ఎంచుకున్నారు. ఆమె మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అన్ని పార్టీల మాదిరిగా పోరాడి వదిలిపెట్టే రకం కాదు మేము అని. టీఆరెస్ పార్టీ విధానమే.. ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు.. అనే ట్యాగ్లైన్తో ముందుకు సాగుతున్నట్టు కూడా ఆమె పలుమార్లు ప్రకటించుకున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఆమె తీసుకున్న ప్రతీ అంశం.. ప్రతీ డిమాండ్కు.. ఓ డెడ్లైన్ ఉంటుంది. తనే డిమాండ్ను ఎంచుకుంటున్నారు. తనే డెడ్లైన్ విధించుకుంటున్నారు.
ఆ విధించిన డెడ్లైన్ను సర్కార్పై సంధిస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్లలో మొదలైన ఈ పోరాట విధానం.. ఆ తరువాత ఆమె పార్టీ తీసుకుంటున్న ప్రతీ లైన్లోనూ ఇది ఉండేలా చూసుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతున్నది. ఖమ్మం వెలుగుమట్లలో కవిత విశ్వరూపం ఎలా ఉంటుందో ప్రభుత్వం తొలిసారి చూసింది. అన్ని పార్టీల్లా ఇలా వచ్చి అలా వెళ్లిపోలేదామె. వెంటనే మెరుపు ధర్నాకు దిగారు. ఆ తరువాత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో యంత్రాంగం కదిలి రాకతప్పలేదు.
పార్టీ స్థాపించిన తరువాత పెట్టిన మొట్టమొదటి బహిరంగ సభను.. పాలమూరు వేదికగా ఎంచుకోవడం.. దానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధనగా నామకరణం చేయడం..ఓ చర్చకు తెరతీసింది. ఆ మీటింగులో.. ఆమె కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపడమే కాకుండా.. కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదాన్ని కూడా ప్రశ్నించడం కలకలం రేపింది. సర్కార్కు దసరా వరకు అల్టిమేటం జారీ చేశారు కవిత ఆ వేదికగానే. ఆలోగా ఈప్రాజెక్టు పై కదలిక లేకపోతే.. తానే పాదయాత్ర చేస్తానని చెప్పడం.. ఆ తదుపరి సర్కార్ దీనిపై వడివడిగా పురోగతి చర్యలకు దిగడం చూశాం. ఈనెల 5న సీఎం.. దీనిపైనే ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆ తరువాత ఆమె తీసుకున్న అంశం.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటు.
ఆయన జయంతి ఆగస్టు 6న. ఆలోపు ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని సర్కార్కు డెడ్లైన్ విధించారు కవిత. మీరు చేస్తారా? లేకపోతే మేమే మా సొంత నిధులతో ఏర్పాటు చేసి… దాని మెయింటెనెన్స్ భాద్యత కూడా మేమే తీసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేట్లో సీఎం ఏర్పాటు చేయడం.. దీనిపై రాజకీయం చెలరేగడం.. ఈ నేపథ్యంలో కవిత తీసుకున్న జయశంకర్ విగ్రహ ఏర్పాటు స్టాండ్తో అందరినీ ఆకర్షించారు. ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణవాదులు కూడా పార్టీలకతీతంగా ప్రశంసించారు. దీన్ని సర్కార్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో తెలియదు గానీ.. ఇదో రాజకీయ వివాదానికే తెరలేపేలా ఉంది.
ఇక తాజాగా ఆమె తీసుకున్న కొత్త నిర్ణయం.. జూలై 2లోగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని. అంటే సీఎంకు నెల రోజుల గడువు డెడ్లైన్గా విధించారన్నమాట. ఇక్కడ ఇది కాదు విశేషం. ఆమె ఏకంగా ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ప్రభుత్వ ల్యాండ్నే ఎంపిక చేసుకుని .. మిలియన్ మార్చ్ తరహాలో ఆ రోజున ఉద్యమకారులంతా సద్దికట్టుకుని రావాలని పిలుపునివ్వడమే అసలు వివాదానికి కారణమైంది. ఏదో కాలయాపన కోసం సర్కార్ కేకే కమిటీని వేసింది కానీ.. అదిప్పట్లో ఇచ్చేది లేదు..ఆ కమిటీ నివేదికలో తేలేదేమీ ఉండదు! అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో.. కవిత పెట్టిన డెడ్లైన్ .. సర్కార్పై ఒత్తిడిని మాత్రం తీవ్రతరం చేస్తుందనడంలో సందేహం లేదు.
ఒకవేళ ఆ డేట్లోపు కూడా ఏమీ కదలిక లేకపోతే.. ఆమె మరో భూపోరాటమే అంటున్నారు.. మరి ఆ పోరాటం ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు. ఇక మొన్న రైతు డిస్కంపై కూడా ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. బషీర్బాగ్ కాల్పుల ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేయడం.. ఆ డిస్కంపై ఉన్న వ్యతిరేకతను.. తద్వారా వచ్చే పోరాట పంథాను ఆమె చెప్పకనే చెప్పినట్టయ్యింది. ప్రధాన ప్రతిపక్షం ఎక్కడున్నదో కానీ.. ఈ కొత్త పార్టీ మాత్రం సర్కార్ను తెగ కలవరపెడుతున్నదనే చెప్పాలి.