సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన “మిస్టీరియస్” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత జయ్ వల్లందాస్ తెలిపారు.
రోహిత్ హీరోగా, అబిద్ భూషణ్ కీలకమైన పోలీస్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో రియా కపూర్, మేఘనా రాజ్ పుత్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ బ్యానర్పై జయ్ వల్లందాస్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో నిర్మాత జయ్ వల్లందాస్ సినిమా విశేషాలను పంచుకున్నారు. కథ, కథనంలో కొత్తదనం ఉంటుందని.. సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను చివరి వరకూ కట్టిపడేస్తాయని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాను రూపొందించామని.. థ్రిల్లర్ ప్రేమికులకు ఇది ప్రత్యేక అనుభూతినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మిస్టీరియస్’ సినిమా ప్రమోషనల్ కంటెంట్కు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని నిర్మాత జయ్ వల్లందాస్ తెలిపారు. ప్రస్తుతం యూఎస్లో నివసిస్తున్న తాను, సినిమాలపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్లోకి వచ్చానని చెప్పారు. తన స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేయాలనే లక్ష్యంతోనే ‘మిస్టీరియస్’ చిత్రాన్ని నిర్మించానని తెలిపారు. మహి చెప్పిన కథ మొదటిసారే నచ్చడంతో ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తొలి ప్రయత్నంలోనే కథాబలం ఉన్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ను నిర్మించగలగడం సంతృప్తినిస్తోందని అన్నారు.
ఈ నెల 12న సినిమాను విడుదల చేయాలనుకున్నామని.. అయితే ‘అఖండ 2’ రిలీజ్ కారణంగా ఒక వారం వాయిదా వేసి ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. 150 థియేటర్లకు పైగా గ్రాండ్గా సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమా టైటిల్కే మంచి రెస్పాన్స్ వస్తోందని అది సినిమాపై ఆసక్తిని మరింత పెంచిందని అన్నారు.
ఇన్నోవేటివ్ స్క్రీన్ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్తో ‘మిస్టీరియస్’ ప్రేక్షకులను ఆద్యంతం కొత్త అనుభూతిలోకి తీసుకెళ్తుందని జయ్ వల్లందాస్ తెలిపారు. సెన్సార్ బోర్డు నుంచి కూడా సినిమాకు ప్రశంసలు దక్కాయని, డిఫరెంట్ మూవీ అంటూ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పారు. సినిమాలోని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా అనిపించేలా తీర్చిదిద్దారని, చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తేలా ఉంటాయని వివరించారు.
యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు అనేక మలుపులు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయని చెప్పారు. మూడు పాటలున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా ఆకట్టుకునే సంగీతం అందించారని తెలిపారు. పోలీసుల గొప్పతనాన్ని చాటే పాటను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. యంగ్ టీమ్తో రూపొందిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ‘మిస్టీరియస్’ తర్వాత టాలీవుడ్లో వరుసగా సినిమాలు నిర్మించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు.