Padma Awards:ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ వేదికగా భారతీయ ప్రతిభా మూర్తులకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక కనులపండువగా సాగింది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాలను దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అత్యంత వైభవంగా విజేతలకు అందజేశారు. రెండు విడతలుగా సాగిన ఈ హిస్టారికల్ ఈవెంట్ లో గత నెల 25న తొలి విడతగా 66 మంది ప్రముఖులకు అవార్డులు అందజేయగా, తాజా విడతలో మరో 47 మంది రంగస్థల, సామాజిక, శాస్త్ర సాంకేతిక రంగాల దిగ్గజాలు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వంటి అగ్రశ్రేణి నాయకులు హాజరైన ఈ సభలో అవార్డు గ్రహీతలని తమ చప్పట్లతో అభినందించారు.
ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ వేడుక ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన మాగంటి మురళీమోహన్ కళారంగానికి చేసిన విశేష సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ‘జగన్మోహిని’, ‘సీతాకోకచిలుక’, ‘త్రిశూలం’ వంటి ఎన్నో ఎవర్గ్రీన్ క్లాసిక్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన, జయభేరి ఆర్ట్స్ పతాకంపై ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు.
రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న రెండో విడత #PadmaAwards2026 పురస్కార ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత
శ్రీ మాగంటి మురళి మోహన్ (కళా విభాగం), గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.#Peoplespadma2026 pic.twitter.com/KLAidCuIau— CBC RO Andhra Pradesh (@CBCANDHRA) June 23, 2026
ఆయనతో పాటు నటనలో తనదైన ‘కామెడీ’ టైమింగ్తో ‘నటకిరీటి’గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు గద్దె బాబూ రాజేంద్రప్రసాద్ను కూడా కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. ‘లేడీస్ టైలర్’, ‘అహ నా పెళ్లంట’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ వంటి చిత్రాలతో తెలుగు వారిని నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేసిన రాజేంద్రప్రసాద్ ఈ గౌరవాన్ని అందుకోవడం తెలుగు సినీ లోకానికి దక్కిన అరుదైన గౌరవం. అలాగే అన్నమయ్య కీర్తనలను విశ్వవ్యాప్తం చేసిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వెంపటి కుటుంబ శాస్త్రి ఏపీ కోటాలో పద్మశ్రీ పురస్కారాలను అందుకొని తెలుగు నేల ఖ్యాతిని చాటారు.
ఇదే వేదికపై వైద్య రంగంలో అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రేడియేషన్ అంకాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడటంలో ఆయన చేసిన అమోఘమైన పరిశోధనలకు ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ టెన్నిస్ కోర్టుల్లో భారతదేశ జెండాను రెపరెపలాడించిన లెజెండరీ ఆటగాడు విజయ్ అమృత్రాజ్ కూడా పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు.
డెవిస్ కప్ టోర్నమెంట్లలో భారత్ను ఫైనల్స్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆయన కోర్టులో చూపిన నైపుణ్యం దేశ క్రీడారంగానికి సరికొత్త దిశను చూపింది. మలయాళీ చిత్రసీమతో పాటు భారతీయ సినిమాను తన నటనతో శాసిస్తున్న మెగాస్టార్ మమ్ముట్టిని కూడా పద్మభూషణ్ అవార్డు వరించింది. ‘ఓరు వడక్కన్ వీరగాథ’, ‘అంబేద్కర్’ వంటి జాతీయ అవార్డు చిత్రాలతో పాటు ఇటీవలి కాలంలో వచ్చిన ‘భ్రమయుగం’, ‘కాథల్ ది కోర్’ వంటి ప్రయోగాత్మక చిత్రాల ద్వారా నటుడిగా తన నటనా విశ్వరూపాన్ని చూపించిన మమ్ముట్టికి ఈ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అలాగే వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ ‘విక్రమ్ వేద’, ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్లను కూడా పద్మశ్రీ పురస్కారంతో రాష్ట్రపతి గౌరవించారు.
తెలంగాణ రాష్ట్రం నుండి విభిన్న రంగాలకు చెందిన ఏడుగురు ప్రతిభామూర్తులు ఈసారి పద్మశ్రీ పురస్కారాలను కైవసం చేసుకున్నారు. విజ్ఞాన, సాంకేతిక రంగాలలో అద్భుతమైన పరిశోధనలు చేస్తూ సాంకేతిక విప్లవాన్ని సామాన్యుడికి చేరువ చేసిన శాస్త్రవేత్త గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్) పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరితో పాటు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి (నృత్యం), వైద్య రంగంలో అరుదైన సేవలు అందించిన గూడూరు వెంకట్రావు (వైద్యం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్, ఇంజినీరింగ్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజినీరింగ్), క్యాన్సర్ రోగుల చికిత్సలో కీలక పాత్ర పోషించిన పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం) ఈ పురస్కారాన్ని స్వీకరించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన రామారెడ్డి మామిడికి మరణానంతరం ఈ అవార్డు దక్కింది. అలాగే యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. దేశ శ్రేయస్సు కోసం, కళల సంరక్షణ కోసం, వైజ్ఞానిక ప్రగతి కోసం తమ జీవితాలను ధారపోసిన ఈ మహానుభావులకు దక్కిన గౌరవం యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది.
also read :ఎవరికో నచ్చాలని కాదు.. డ్రెస్సింగ్ వివాదంపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!