Rashmi Gautam: జులై 3 నుంచి మరింత ఎంటర్ టైన్ అందించేందుకు సిద్దమవుతుంది ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్. ఇండియాలోనే మొట్టమొదటి డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ రియాలిటీ షోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పాపులర్ యాంకర్ రష్మి గౌతమ్, సీనియర్ నటి లక్ష్మీ మంచు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన బోల్డ్ ప్రశ్నలకు రష్మి తనదైన శైలిలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా సుధీర్ తో కాంబినేషన్ మరియు తన సినిమా కెరీర్ లో గ్యాప్ పై వచ్చిన వార్తలపై తనదైన శైలిలో రియాక్ట్ అయింది.
రిలేషన్షిప్స్ మరియు ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుతూ, జీవితంలో స్నేహం అనేది ఎప్పుడూ రెండు వైపుల నుండి ఒకేలా రాదని, కొన్నిసార్లు అది ఒక వైపు నుంచే ఉంటుందని, దాని గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని రష్మి చాలా ప్రాక్టికల్ గా మాట్లాడింది. ఇక వెండితెరపై కొంతకాలంగా గ్యాప్ రావడంపై స్పందిస్తూ, తనకు ఎలాంటి గ్యాప్ రాలేదని, కేవలం తన మనసుకు నచ్చిన, బలమైన పాత్రల కోసం మాత్రమే వేచి చూస్తున్నానని స్పష్టం చేసింది. సరైన స్క్రిప్ట్ కుదిరినప్పుడు కచ్చితంగా మళ్లీ వెండితెరపై సందడి చేస్తానని నమ్మకంగా చెప్పింది.
ఇక ఇదే సమయంలో సుధీర్, రష్మి కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రాబోతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ మధ్యే సుధీర్ కూడా ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడినట్టు గుర్తు చేయగా, రష్మి చాలా కూల్ గా కౌంటర్ ఇచ్చింది. “ఆ వార్తలు మీరే రాశారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసి ఉండాలి” అంటూ నవ్వుతూనే సెటైర్ వేసింది. ప్రస్తుతానికైతే అలాంటి సినిమా ప్రతిపాదనలేవీ లేవని, అవన్నీ కేవలం అబద్దాలే అని తేల్చిచెప్పింది.గతంలో ఈ హిట్ జోడి బుల్లితెరపై సృష్టించిన మ్యాజిక్ కారణంగా ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి, కానీ అందులో ఎలాంటి నిజం లేదని రష్మి మాటలతో స్పష్టమైంది.
also read :‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
మరోవైపు ఈ షో షూటింగ్ లో రష్మి ఎనర్జీ, ప్రొఫెషనలిజం గురించి లక్ష్మీ మంచు ఆకాశానికెత్తేసింది. లొకేషన్ లో వీరిద్దరి బాండింగ్ ఎలా ఉందనే ప్రశ్నకు లక్ష్మి స్పందిస్తూ, రష్మి నిజమైన ప్రొఫెషనల్ అని కొనియాడింది. ఈ షోలో తాను కేవలం జడ్జ్ గా మాత్రమే వ్యవహరించానని, కానీ రష్మి మాత్రం హై హీల్స్ వేసుకుని రోజుకు పన్నెండు గంటల పాటు నిలబడి హోస్టింగ్ చేస్తుంటే చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. అంత సమయం నిలబడటం చూసి తనకే కాళ్లు నొప్పులు పుట్టాయంటూ లక్ష్మి నవ్వేసింది. ఒక ప్రొడ్యూసర్ గా ఎంతోమంది ఆర్టిస్టులను చూసిన తనకు, రష్మి వర్క్ డెడికేషన్ మరియు ఆటిట్యూడ్ ఎంతగానో నచ్చాయని, ఆమెను చూసి తాను ఇన్ స్పైర్ అయ్యానని లక్ష్మి ప్రశంసల వర్షం కురిపించింది.
అయితే స్క్రీన్ మీద కనిపించే ఎనర్జీ వేరని, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మేనేజ్మెంట్ పెట్టిన టార్చర్ భరించలేక ఇద్దరం తెగ కంప్లైంట్ చేసుకునేవాళ్లమంటూ రష్మి సరదాగా గుట్టు విప్పేసింది. ఆహా లో రాబోతున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ రియాలిటీ షో డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జులై 3న స్ట్రీమింగ్ కానున్న ఈ షో కోసం అటు సోషల్ మీడియా స్టార్స్, ఇటు సెలబ్రిటీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి రష్మి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ యాంకరింగ్, లక్ష్మీ మంచు జడ్జిమెంట్ ఈ షోకి ఎలాంటి మైలేజ్ తెస్తుందో !