Sayaji Shinde : షియాజీ షిండే ..తనదైన విలక్షణ నటనతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా నటుడిగా సాయాజీ షిండే సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘శూల్’, ‘సర్కార్ రాజ్’, ‘సంజు’ వంటి హిందీ చిత్రాలతో పాటు తెలుగులోనూ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో మెరిసిన ఈ సీనియర్ యాక్టర్, ఇప్పుడు ఒక రియల్ లైఫ్ హీరోగా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే .. 2016 నాటి ఒక సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. పుణెలో వందల కోట్ల ఆస్తి ఉండి కూడా సమాజానికి ఉపయోగపడని ఒక ధనవంతుడిని చూసినప్పుడు, తీవ్ర కరవుతో అల్లాడుతున్న పల్లెల్లో నీడ కోసం ఒక్క చెట్టు కూడా లేని దుస్థితిని గమనించినప్పుడు ఆయన గుండె తరుక్కుపోయింది. అదే సమయంలో 92 ఏళ్ల వయసున్న తన తల్లిని కోల్పోయాడు. మరణాన్ని ఆపలేకపోయినా, తన తల్లి జ్ఞాపకాలను ఈ నేలపై శాశ్వతంగా ఉంచాలనుకున్నారు. అందుకే ఆమె బరువుకు సమానంగా విత్తనాలను తూకం వేసి, వాటిని మహారాష్ట్ర అంతటా నాటాలని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.
Also read :సీఎం విజయ్ రూట్ మార్చారుగా.. బ్లాక్ సూట్ టు పట్టుపంచె! ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న విజువల్స్!
ఈ ఆలోచనే ‘సహ్యాద్రి దేవరాయ్’ అనే ఒక సరికొత్త ఉద్యమానికి నాంది పలికింది. అప్పట్లో హైదరాబాద్ నుండి ఏకంగా రెండు ట్రక్కుల నిండా దాదాపు రెండు లక్షల రూపాయల ఖర్చుతో మొక్కలను తెప్పించి ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. పురాతన కాలం నాటి పవిత్ర అడవుల కాన్సెప్ట్ ఆధారంగా మొదలైన ఈ మిషన్ కింద ఇప్పటివరకు ఏకంగా 6.5 లక్షలకు పైగా చెట్లను నాటడం విశేషం. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, దాదాపు 200 జాతుల పక్షులు, కీటకాలకు ఆశ్రయమిచ్చే 200కు పైగా భారీ మర్రిచెట్లను నరికివేయకుండా అత్యాధునిక సాంకేతికతతో వేరే చోటుకు విజయవంతంగా రీ-ప్లాంటేషన్ చేయించి ప్రభుత్వ యంత్రాంగానికే సవాల్ విసిరారు. గుడుల్లో ఇచ్చే ప్రసాదానికి బదులుగా మొక్కలను ఇవ్వాలనే సరికొత్త ప్రతిపాదనను కూడా ఆయన తెరపైకి తెచ్చారు.
ఇరిగేషన్ శాఖలో వాచ్మెన్ ఉద్యోగం
నిజానికి సాయాజీ షిండే జీవితం ఎన్నో అష్టకష్టాలు. సతారా జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన భూమిని 1978లో ఒక డ్యామ్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా ఇరిగేషన్ శాఖలో వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చారు. కానీ కోల్పోయిన భూమికి బదులుగా రావాల్సిన భూమి మాత్రం ఏకంగా 35 ఏళ్ల తర్వాత, అంటే 2022లో చేతికి వచ్చింది. అయినా ఆయన ఎక్కడా అధైర్యపడలేదు. సినిమా రంగంలో సెటిల్ అయి చేతి నిండా డబ్బు, కారు, ఇల్లు సంపాదించినా ప్రకృతి రుణం తీర్చుకోవడమే ముఖ్యంగా బతికారు.
Also read :‘పుష్ప 2’ వివాదం నిజమేనా? దేవిశ్రీ ప్రసాద్ను పక్కన పెట్టే ఆలోచనలో సుకుమార్.. అసలేం జరుగుతోంది?
ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నుండి ఆలస్యంగానైనా చేతికి వచ్చిన ఆ భూమిని ఒక పెద్ద నర్సరీగా మార్చి, వేల సంఖ్యలో గ్రామాలకు పచ్చదనాన్ని పంచేందుకు సాయాజీ షిండే సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఒక్క చెట్టు కూడా లేక 60 ఏళ్లుగా ఎడారిలా ఉన్న ఓ గ్రామంలో ఊరి జనమంతా కలిసి 17 లక్షల రూపాయలు పోగుచేసేలా స్ఫూర్తి నింపి, అక్కడ 16,000 చెట్లతో పచ్చని అడవిని సృష్టించిన ఘనత ఆయనది. ప్రస్తుతం 48 విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లక్షలాది చెట్లలోనే తన తల్లి బతికి ఉందని నమ్ముతూ షియాజీ చేస్తున్న ఈ పోరాటం ఎందరికో ఆదర్శం అని చెప్పకతప్పదు.