Karuppu Release: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈసినిమా విడుదల సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదా పడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసి సూర్య ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read also-మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడాకులపై క్లారిటీ.. ప్రైవసీ కోరుతూ..
నిజానికి ఈ సినిమా కోసం తమిళనాడు ప్రభుత్వం ఉదయం 9 గంటల షోలకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. కానీ, కొన్ని ఆర్థిక లావాదేవీలు కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా థియేటర్లలో మార్నింగ్ షోలు రద్దయ్యాయి. అసలు సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక థియేటర్ల యజమానులు సైతం అయోమయంలో పడ్డారు. ఒకవైపు సినిమా విడుదల ఆగిపోయిందని గందరగోళం నడుస్తుంటే.. ముంబై, పూణే, వారణాసి వంటి నగరాల్లో నిర్మాత అనుమతి లేకుండానే షోలు పడటం ఇండస్ట్రీలో కలకలం రేపింది. క్యూబ్ సినిమాస్ ద్వారా ఈ అన్అథరైజ్డ్ స్క్రీనింగ్స్ జరిగినట్లు వార్తలు రావడంతో నిర్మాత ఎస్.ఆర్. ప్రభు వెంటనే రంగంలోకి దిగారు.
సుమారు రూ. 140 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంపై భారీ బిజినెస్ జరిగిందని, ఇలాంటి సమయంలో అనధికారిక ప్రదర్శనలు సినిమాను దెబ్బతీస్తాయని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేస్తూ.. “సినిమా కంటెంట్ను ఎవరైనా రికార్డ్ చేసినా, సోషల్ మీడియాలో షేర్ చేసినా లేదా డౌన్లోడ్ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని గట్టిగా హెచ్చరించారు.
Read also-ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్.. ముంబై వేదికగా ‘NTRNeel’ గ్లింప్స్ లాంచ్?
ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సూర్య పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సూర్య-త్రిష కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ అడ్డంకులన్నీ తొలగించి సినిమాను సజావుగా విడుదల చేసేందుకు నిర్మాతల మండలితో చర్చలు జరుపుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.