Ameesha patel:టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకులకు నువ్వే కావాలి’, ‘బద్రి’ చిత్రాలతో దగ్గరై, బాలీవుడ్లో ‘గదర్’ వంటి బ్లాక్బస్టర్లతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అమీషా పటేల్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ముంబై చర్చ్గేట్లోని ఆమె తల్లిదండ్రుల నివాసంలో విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. నమ్మకంగా పనిచేస్తున్న ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్లు తేలడంతో అమీషా తల్లి ఆశా పటేల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ దొంగతనం వివరాలు మరియు పోలీసుల విచారణకు సంబంధించిన వివరాలు చూద్దాం..
పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని చర్చ్గేట్ ప్రాంతంలో అమీషా పటేల్ తల్లిదండ్రులు నివాసముంటున్నారు. పాల్ఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే మహిళ గత ఏడాదిన్నరగా వీరి ఇంట్లో గృహ సహాయకురాలిగా (పనిమనిషిగా) పనిచేస్తోంది. ఇక ఇంట్లో అందరూ నమ్మకంగా చూసుకుంటున్న సమయాన్నే ఆసరాగా చేసుకుని, ఆమె మెల్లగా విలువైన వస్తువులను మాయం చేయడం ప్రారంభించింది.
జనవరి 2026 నుంచే ఇంట్లోని కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోవడం ప్రారంభమైంది. అయితే ఇటీవల ఆగస్టు 20న సుమారు రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన డైమండ్ స్టడెడ్ గోల్డ్ బ్యాంగిల్స్ (వజ్రాలు తాపడం చేసిన బంగారు గాజులు) పూర్తిగా మాయమయ్యాయి. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి సీమా ఘాటే ఈ ఆభరణాలను దొంగిలించినట్లు గుర్తించారు.
ఇంట్లో నగలు మాయమవ్వడంపై అమీషా తల్లి ఆశా పటేల్కు పనిమనిషి సీమాపైనే మొదటి నుంచి తీవ్ర అనుమానం ఉండేది. దీంతో పోలీసుల వరకు వెళ్లకుండా, “తప్పు ఒప్పుకుని పోయిన ఆభరణాలను తిరిగి ఇచ్చేయ్” అని సీమాను నేరుగా కోరారు. అయితే ఆమె ఎంతకీ నగలు తిరిగి ఇవ్వకపోవడంతో, ఇక చేసేదేమీ లేక ఆశా పటేల్ మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
also read:నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!
ఆశా పటేల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మెరైన్ డ్రైవ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, సీమా ఘాటేను నిందితురాలిగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆమెను కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 15 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశించింది. నిందితురాలికి గతంలో ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా, ఈ చోరీలో వేరే ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇప్పటివరకు చోరీకి గురైన రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు ఇంకా రికవరీ కాలేదని, త్వరలోనే వాటిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. నమ్మి ఇంట్లో పెట్టుకున్న పనిమనుషులే ఇలాంటి చోరీలకు పాల్పడటం అమీషా పటేల్ కుటుంబంతో పాటు ముంబై వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.