Tollywood Hero:టాలీవుడ్ హీరోలందరూ ఎక్కువగా హైదరాబాద్లోనే ఇళ్లను కొనుగోలు చేసి అక్కడే స్థిరపడదం మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్న విషయమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో చిన్న మార్పు కనిపిస్తోంది. మాచో స్టార్ గోపీచంద్ విశాఖపట్నంలో.. ఒక ఇల్లు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ హీరో ఇల్లు తీసుకోవడం అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.
గోపీచంద్ తన కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ పనుల కోసం విశాఖలోని షీలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు ఒక భయం ఉంటుంది. పనులు ఆలస్యం అవుతాయి, గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే గోపీచంద్కు అక్కడ ఎదురైన అనుభవం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.
కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికే ఆయనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా వేగంగా పూర్తయింది. ఎటువంటి ఆలస్యం లేకుండా అధికారులు తమ పనిని చక్కగా నిర్వహించారు. డిజిటల్ విధానంలో పనులు సులభంగా పూర్తి కావడం గోపీచంద్ను ఆశ్చర్యానికి గురిచేసిందంట.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధమైన మార్పులు రావడం చాలా మంచి విషయమని చెప్పారు. సిబ్బంది పనితీరు చాలా మెరుగ్గా ఉందని ప్రశంసించారు. ఒక సెలబ్రిటీ వచ్చినప్పటికీ సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు.
ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖలో గోపీచంద్ ఇల్లు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, అక్కడి ప్రభుత్వ కార్యాలయ పనితీరుపై ఆయన ఇచ్చిన స్పందన కూడా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సేవలు క్రమంగా మెరుగుపడుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గోపీచంద్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర హీరోలకు కూడా ప్రేరణగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు కొనుగోలు చేస్తారా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.
ALSO READ: Peddi Update: రామ్ చరణ్ బర్త్డేకి ట్రీట్ రెడీ.. అప్డేట్ పోస్టర్ వైరల్!