Upasana Konidela: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ గౌరవ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ఎప్పుడూ తన సామాజిక బాధ్యతలతో పాటు కుటుంబ విలువల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా, టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన ఒక పాత ఇంటర్వ్యూలో ఆమె తమ కుటుంబంలో పాటించే కొన్ని కఠినమైన నియమాలను (Family Rules) వెల్లడించారు. ముఖ్యంగా సంపద, కుటుంబ బంధాల మధ్య ఎలాంటి సమతుల్యత ఉండాలనే దానిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
“ఆస్తి గొడవలకు మా ఇంట్లో చోటు లేదు”
“ఆస్తి లేదా సంపద అనేది కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు ఎప్పటికీ కారణం కాకూడదు అనేది మా ఫ్యామిలీలో అందరూ బలంగా నమ్మే మొదటి నియమం” అని ఉపాసన స్పష్టం చేశారు. ఒక కుటుంబంగా తామంతా కలిసికట్టుగా ఉండటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, డబ్బు ఎప్పుడూ బంధాల కంటే ఎక్కువ కాదని ఆమె పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పెంపకం
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, అలాగే తన సొంత కుటుంబం (కామినేని ఫ్యామిలీ) రెండూ కూడా పిల్లలను ఎంతో బాధ్యతాయుతంగా పెంచాయని ఉపాసన చెప్పారు. సంపద అనేది ఒక లగ్జరీ మాత్రమే కాదని, దానితో పాటు సమాజం పట్ల ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుందని తమకు చిన్నప్పటి నుంచే నేర్పించారని ఆమె గుర్తు చేసుకున్నారు.
పిల్లల భవిష్యత్తుపై క్లారిటీ
రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె ‘క్లింకారా కొణిదెల’కు తాము ఇచ్చే అత్యుత్తమ బహుమతి సంపద కాదని, మంచి సంస్కారం, విద్యాభ్యాసం మాత్రమేనని ఆమె అన్నారు.
“మా పిల్లలకు మేము ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదు. వారు సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నారు, ఎలాంటి విలువులతో పెరుగుతున్నారు అనేదే మాకు ముఖ్యం. సంపదను కాపాడుకోవడం, దానిని మంచి పనులకు ఉపయోగించడం వారికి తెలియాలి” అని ఉపాసన వివరించారు.
మెగా ఫ్యామిలీలో అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అందరూ కూడా విరాళాలు, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారనే సంగతి తెలిసిందే. ఉపాసన సైతం అపోలో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పంచుకున్న ఈ ఫ్యామిలీ రూల్స్ మెగా అభిమానులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.