M. K. Thyagaraja Bhagavathar:ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి స్టార్ హీరోలు.. వారి కుటుంబాలు.. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు.. అంతెందుకు వారి శత్రువులు కూడా ముందే తెలిసిపోతున్నారు. కానీ, అప్పటితరం నటుల గురించి ఈ తరం వారికి తెలియడం అనేది చాలా కష్టం. ఎప్పుడో ఎవరో ఒకరు ఏదైనా వారి గురించి బయోపిక్ లాంటివి తీస్తే.. వాళ్ళ గురించి ఆరాలు తీయడం మొదలుపెడతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే నడుస్తుంది. లెజండరీ తమిళ నటుడు MKT బయోపిక్ వస్తున్న విషయం తెల్సిందే.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంత. ఈ సినిమాను దుల్కర్, రానా కలిసి నిర్మిస్తున్నారు. నవంబర్ 15 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సినిమా.. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని, ఆయన జీవితంలో జరిగిన చేదు సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారట. ఆయన 49 ఏళ్లకే ఎందుకు తనువు చాలించాల్సి వచ్చింది. అసలు ఆయన ఎవరు.. ? ఆయన జీవితంలో ఏం జరిగింది.. ? అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
MKT అంటే మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్ ఆసారి. ఇదే ఆయన పూర్తిపేరు. బ్రిటిష్ రాజ్లోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని అప్పటి మైలదుత్తురైలో త్యాగరాజ జన్మించారు. శాస్త్రీయ గాయకుడుగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అసలు ఆయన గాత్రం వింటే మైమరిచిపోని వారుండేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు. ఎంతో గొప్ప గాయకుడో.. అంతే అందగాడు. దీంతో ఒకపక్క గాయకుడిగా చేస్తూనే ఇంకోపక్క రంగస్థల కళాకారుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. 1934 లో పావలక్కోడి అనే చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక త్యాగరాజ వెనక్కి తిరిగి చూడలేదు. 1934 నుండి 1960 వరకు 14 సినిమాల్లో నటిస్తే వాటిలో 10 బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. ముఖ్యంగా 1944లో విడుదలైన హరిదాస్ చిత్రం మద్రాసులోని బ్రాడ్వే థియేటర్లో వరుసగా మూడు సంవత్సరాలు ప్రదర్శితమైంది. ఒకే థియేటర్లో అత్యధిక కాలం ప్రదర్శితమైన చిత్రంగా రికార్డును సృష్టించిన సినిమా అది.
త్యాగరాజను అందరూ భారతీయ మొట్ట మొదటి సూపర్ స్టార్ అని పిలిచేవారు. ఆయన రాజభోగాలు అలానే ఉండేవి. అప్పట్లోనే బెంజ్ కారును నడిపిన మొట్ట మొదటి వ్యక్తి త్యాగరాజ భాగవతార్. అంతేకాకుండా బంగారు ప్లేట్ లో అన్నం తినడం దగ్గర నుంచి ఆయన ప్యాలెస్ లు, విలాసాలు చూసి అప్పట్లో అందరూ ముక్కున వేలేసుకొనేవారట. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే త్యాగరాజ భాగవతార్ జీవితాన్ని ఒక నిర్మాత చిన్నాభిన్నం చేశాడు. ఒక హత్యకేసులో ఆయనను ఇరికించి జైలుపాలు చేశాడు. ఆ నిర్మాత పేరు శ్రీరాములు నాయుడు. లక్ష్మీ కాంతన్ అనే జర్నలిస్ట్ ను హత్యచేసింది త్యాగరాజనే అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1947 లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నిర్దోషి అని నిరూపించుకొనే సరైన ఆధారాలు లేని త్యాగరాజ.. రెండేళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు.
ప్రేక్షకులు మళ్లీ అదరిస్తారేమో అన్న నమ్మకంతో జైలు నుంచి బయటకు వచ్చాక కూడా సినిమాలు చేశాడు. కానీ, ఒక క్రిమినల్ ను మేము తెరపై హీరోగా చూడలేమని వారు నిరాకరించారు. దీంతో క్రుంగిపోయిన త్యాగరాజ అనారోగ్యం కొద్ది కొద్దిగా క్షీణించి.. ఆస్తులు అన్నీ పోగొట్టుకొని 49 ఏళ్ల వయస్సులో మరణించారు. అప్పట్లో త్యాగరాజ మర్డర్ కేసు గురించి కథలు కథలుగా చెప్పుకొనేవారట ఇన్నాళ్ళకు దుల్కర్ ఆయన కథను బయటపెట్టాడు. అయితే ఆయన మనవడు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి వీల్లేదని కేసు వేశాడు. మరి ఈ సినిమా ఆగుతుందా లేదా అనేది చూడాలి.