14 days Judicial Remand for MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా.. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత ఏప్రిల్ 9 వరకూ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో.. కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు.
కాగా.. తన చిన్నకుమారుడికి ఏప్రిల్ 16 వరకూ పరీక్షలు ఉన్నాయని, అప్పటి వరకూ బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఈడీ తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారని, కవిత చాలా ఈజీగా సాక్ష్యాలను మార్చేస్తారని బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు లాయర్ న్యాయమూర్తికి తెలిపారు.
కోర్టులో హాజరయ్యే ముందు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా జైలుకు వెళ్లినా .. తర్వాత కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్నారు. తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇస్తుందని, మూడో నిందితుడు రూ.50 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చాడని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన.. రెండోసారి ఆదేశాలు జారీ..
కవితను అరెస్ట్ చేసినప్పుడే.. తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ క్లబ్ కు స్వాగతం అక్కా అంటూ ఒక లేఖను రాశాడు. ఆ తర్వాత కేజ్రీవాల్ ను ఉద్దేశించి మరో లేఖ రాశాడు. సుకేశ్ లేఖలో రాసినట్టే ఇప్పుడు కవిత తీహార్ జైలుకు వెళ్లక తప్పలేదు. నెక్ట్స్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పూర్తయ్యాక కూడా.. ఆయన్నూ తీహార్ జైలుకు తరలించే సంకేతాలు లేకపోలేదు. కానీ.. ఇంతవరకూ ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. తీహార్ జైలుకు తరలిస్తే.. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారా ? లేక పదవికి రాజీనామా చేస్తారా ? చూడాలి.