Arvind Kejriwal Second Ruling Delhi From Lockup: ఈడీ కస్టడీ నుంచే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాలన సాగిస్తున్నారు. అక్కడ నుంచే మంగళవారం మరోసారి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే తొలిసారి ఇచ్చిన ఆదేశాలపై ఈడీ తీవ్రంగా స్పందించింది. తాము పేపర్లుగానీ, కంప్యూటర్ గానీ ఆయనకు ఇవ్వలేదని ఈడీ స్పష్టం చేసింది. అలాంటప్పుడు కేజ్రీవాల్ ఎలా ఆదేశాలు ఇవ్వగలరని ప్రశ్నించింది. దీనిపై విచారణను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మరోసారి కేజ్రీవాల్ పాలనపై ఆదేశాలు జారీ చేయడం ఆసక్తిగా మారింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను మార్చి 21 ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను కస్టీడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆయన జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ నేతలు అరెస్ట్ అయినప్పటి నుంచి చెబుతున్నారు. వారి చెప్పిన ప్రకారమే కేజ్రీవాల్ కస్టడీ నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కేజ్రీవాల్ తాజాగా జారీ చేసిన ఆదేశాల వివరాలను ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. మొహల్లా క్లినిక్ ల్లో మందుల కొరత లేకుండా చూడాలని ఉత్తర్వులు ఇచ్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఈడీ కస్టడీలో ఉన్నా ప్రజల ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు.
Also Read: నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ.. తీహార్ జైలా ? బెయిలా ?
కేజ్రీవాల్ జైలు నుంచి తొలి ఉత్తర్వులను నీటి సమస్య నివారణపై జారీ చేశారు. మంత్రి అతిశీకి నోట్ ద్వారా ఈ ఆదేశాలు అందించారు. ఈ ఉత్తర్వులపై వివాదం రేగింది. మంత్రి అతిశీని ప్రశ్నిస్తామని ఈడీ ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ ఆందోళనలు ఉద్ధృతం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి ఆప్ నేతలు పిలుపునిచ్చారు. ఆప్ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మోదీ ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. పీఎం నివాస పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే లోక్ కల్యాణ్ మార్గ్ లో మెట్రో స్టేషన్లు మూసివేశారు.