Uttar Pradesh: కలికాలంలో రకరకాల వింతలు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. సరిగ్గా అదే జరిగింది.. జరుగుతోంది కూడా. తాజాగా భార్యని తాను కోరుకున్న లవర్కు ఇచ్చి వివాహం జరిపించాడు ఆమె భర్త. దాదాపు రెండు దశాబ్దాల వారిద్దరి బంధాన్ని ఫుల్స్టాప్ పడింది. మరి వారి పిల్లల మాటేంటన్నది అసలు ప్రశ్న. సంచలనం రేపిన ఈ యవ్వారం యూపీలో వెలుగుచూసింది.
ఉత్తర ప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక ప్రేమ వ్యవహారం ఆ రాష్ట్రం దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా 21 ఏళ్ల భార్యభర్తల మధ్య బంధానికి సినిమా తరహాలో ముగింపు ఇచ్చాడు ఆమె భర్త. భార్య ప్రేమ వ్యవహారం వల్ల ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త తీసుకున్న నిర్ణయం ఆ గ్రామమంతా చర్చనీయాంశంగా మారింది.
యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లా దేవరి గ్రామంలో ఈ వ్యవహారం బయటపడింది. ఆ గ్రామానికి చెందిన బుద్ధిరామ్ నిషాద్.. 21 ఏళ్ల కిందట ఫుల్మతిని ప్రేమించాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు చాలా కాలం కలిసి జీవించారు. ఈ సమయంలో వారికి ఐదుగురు పిల్లలకు జన్మించారు. వారిలో 18 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
వారి సంసారం సవ్యంగా సాగుతున్న సమయంలో భార్యభర్తల మధ్య విభేదాలు రావడం మొదలైంది. హాయిగా సంసారం సాగుతున్న వీరి కాపురంలోకి కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఆ గ్రామానికి చెందిన అవధేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది ఫుల్మతి. ఈమె కంటే సదరు యువకుడు 13 ఏళ్లు చిన్నవాడు. ఈ విషయం ఆమె భర్త నిషాద్కు తెలిసింది.
అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగాయి. అది తప్పని పలుమార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సరే భార్య వినిపించుకోలేదు. సరిగ్గా రెండు నెలల కిందట ఫుల్మతి.. అవధేష్తో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం నిషాద్ కుటుంబంతోపాటు ఆ ప్రాంతమంతా తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత ఫుల్మతి ఇంటికి తిరిగి వచ్చింది.
ఆమె తిరిగి వచ్చినా కుటుంబంలో కలహాలు కంటిన్యూ కావడం మొదలైంది. దీంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. నిరంతరం ఘర్షణ జరుగుతుండడంతో దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు నిషాద్. పరస్పర అంగీకారంతో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు నిషాద్-పుల్మతి దంపతులు.
ప్రియుడితో ఉంటానని భార్య తెగేసి చెప్పడంతో ఆమె భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇరువైపుల కుటుంబ సభ్యులు-గ్రామ పెద్దల సమక్షంలో సదరు యువకుడితో తన భార్యకు పెళ్లి జరిపించాడు. వివాహం తర్వాత కొత్త జంటకు వీడ్కోలు పలికాడు నిషాద్. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భర్త తీసుకున్న నిర్ణయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
ALSO READ: ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన పౌర సమాజం, కండక్టర్ సస్పెండ్
ఆ ప్రాంత ప్రజలు వివిధ కోణాల్లో చూస్తున్నారు. ఐదుగురు పిల్లల భవిష్యత్తు, వారి సంరక్షణ ఏంటన్నది ప్రధాన చర్చ. దీనిపై నిషాద్ నోరు విప్పాడు. 21 ఏళ్ల కిందట తాను ఫుల్మతిని ప్రేమతో వివాహం చేసుకున్నానని తెలిపాడు. తన భార్య వేరొకరితో జీవితం గడపాలని కోరుకున్నప్పుడు ఆమె సంతోషాన్ని అంగీకరించడమే ఉత్తమమని భావించినట్లు చెప్పుకొచ్చాడు. తాను ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.