Army Dog Tyson: జమ్ముకశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం చత్రో ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆశ్చర్యకర విషయం తాజాగా వెలుగు చూసింది. ఆర్మీకి చెందిన కుక్క ముందుగా ఉగ్రవాదులను పసిగట్టిందని.. వారు కాల్పులు జరిపినప్పటికీ ధైర్యంగా వారి ఆచూకీని సైన్యానికి అందించిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.
జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు అనుమానిత ముష్కరుల కోసం గత నెలరోజులుగా కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఆర్మీకి చెందిన స్నైపర్ డాగ్ టైసన్ తో కలిసి శోధన చేపట్టాయి. కూంబింగ్ సమయంలో టైసన్.. ఓ ఇంట్లోకి పరిగెత్తి.. అక్కడ నక్కి ఉన్న ముగ్గురు ముష్కరులను గుర్తించింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు టైసన్ పై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ బుల్లెట్ టైసన్ కాలులోకి దూసుకెళ్లింది.
కాలికి బుల్లెట్ గాయం అయినప్పటికీ టైసన్ వెనకడుగు వేయలేదని భద్రతా బలగాలు తెలిపాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో సాయం చేసిందని పేర్కొన్నాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. చనిపోయినవారిలో ఒకరు జైష్ కమాండర్ సైఫుల్లాగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు ఏ ఉగ్రసంస్థకు చెందినవారా? అన్న కోణంలో దర్యాప్తు వర్గాలు శోధిస్తున్నాయి.
Also Read: Best Time to Use AC: ఈ సమయాల్లో ఏసీ వేయొద్దు.. అలా చేస్తే ఈ రెండు నష్టాలు తప్పవు!
మరోవైపు టైసన్ కాలికి గాయం కావడంతో దానిని వెంటనే చికిత్స నిమిత్తం విమానంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం బాగుందని.. గాయం నుంచి క్రమంగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. త్వరలోనే టైసన్ తిరిగి భద్రతా బలగాలతో కలిసి ఆపరేషన్ లో పాల్గొంటుందని స్పష్టం చేశారు. ముష్కరులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టైసన్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. భద్రతా బలగాలకే కాకుండా.. భారత సైన్యానికి చెందిన శునకం ముందు కూడా పాక్ ముష్కరులు తలవంచాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: Wedding Violence: పెళ్లి వేడుకలో చిచ్చుపెట్టిన శునకం.. కర్రలు, కుర్చీలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు!