తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక అరుదైన సమావేశం సచివాలయంలో చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు కీలక నేతలు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం లభించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వాల హయాంలో మాజీ మావోయిస్టులకు సచివాలయ ప్రవేశంపై ఆంక్షలు ఉండగా.. రేవంత్ సర్కార్ ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి చర్చలకు ప్రాధాన్యతనిచ్చింది.
ఈ భేటీలో మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్తో పాటు చంద్రన్నలు పాల్గొన్నారు. వీరంతా సీఎంతో రాజకీయ ఎజెండాపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావడం.. జనజీవన స్రవంతిలో కలిసిన వారి భవిష్యత్తుపై ఈ చర్చలు సాగాయి. గతంలో ఆయుధాలు పట్టిన నేతలు నేడు ప్రభుత్వం ముందు తమ ప్రతిపాదనలు ఉంచినట్టు సమాచారం. ఈ భేటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు.
సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా స్వేచ్ఛగా తమ వృత్తులను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. మాజీ మావోయిస్టులు ఇతర ఏ పని చేసుకున్నా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే చట్టం అందరికీ సమానమేనని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. మావోయిస్టుల లొంగుబాటుతో పాటు వారి పునరావాసానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ కీలక భేటీలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి సహా సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి వంటి కీలక అధికారులు హాజరయ్యారు. ఒకవైపు రాజకీయ ఎజెండాను చర్చిస్తూనే.. మరోవైపు శాంతిభద్రతల అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ మావోయిస్టుల అనుభవాన్ని సామాజిక మార్పు కోసం ఏ విధంగా వాడుకోవాలనే కోణంలో కూడా సమాలోచనలు జరిగినట్లు సమాచారం.
చాలా కాలం తర్వాత మావోయిస్టు నేపథ్యం ఉన్న నాయకులు ప్రభుత్వంతో నేరుగా చర్చలకు రావడం రాష్ట్రంలో కొత్త రాజకీయ కోణాలకు దారితీయవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ఈ విధానం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచనను మెజారిటీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీలో చేయబోయే ప్రకటన ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి విధివిధానాలు ఖరారు చేస్తుందో స్పష్టం కానుంది.
ALSO READ: Harish Rao: రేవంత్ రెడ్డి గారూ.. మీ విద్యా కమిషన్లో విద్యావేత్తలు ఎక్కడ?.. హరీశ్ రావు సెటైర్లు