Ashwini Vaishnaw: దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా సమక్షంలోనే భారత్ ఏఐ సామర్థ్యంపై గట్టి గళం వినిపించారు. భారత్ను ‘రెండో స్థాయి ఏఐ శక్తి’గా వర్గీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారత్ అగ్రశ్రేణిలోనే ఉందని గణాంకాలతో వివరించారు.
ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నివేదికను ప్రధానంగా ప్రస్తావించారు. “ఐఎంఎఫ్ ప్రమాణాలు ఏమిటో నాకు తెలియదు కానీ, స్టాన్ఫోర్డ్ వర్గీకరణ ప్రకారం ఏఐ వ్యాప్తి, సంసిద్ధతలో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. ఇక ఏఐ ప్రతిభ (AI Talent) విషయంలో మన దేశం రెండవ స్థానంలో నిలిచింది. కాబట్టి రెండవ వర్గంలో మీ వర్గీకరణ సరైనదని నేను అనుకోను. భారత్ వాస్తవానికి మొదటి శ్రేణిలోనే ఉంది.” అని ఆయన స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ అనుసరిస్తున్న ప్రమాణాలు పాతవి.. చాలా పరిమితమైనవి అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం ఏఐ మోడల్స్ అభివృద్ధి చేయడంపైనే కాకుండా, ఏఐ వ్యాప్తిని సామాన్యులకు చేరవేయడంపైనే తమ ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు. ఏఐ సామర్థ్యాన్ని కేవలం మోడల్స్ ద్వారా కాకుండా.. అప్లికేషన్లు, మోడల్స్, చిప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎనర్జీ అనే ఐదు పొరల్లో (5 Layers) చూడాలని, భారత్ ఈ ఐదింటిలోనూ వేగంగా దూసుకుపోతోందని వివరించారు. భారత్ త్వరలోనే ప్రపంచానికి AI యూజ్ కేస్ క్యాపిటల్గా మారుతుందని, కేవలం పెద్ద మోడల్స్ నిర్మించడం కంటే సామాజిక సమస్యలకు పరిష్కారాలను చూపడమే కీలకమని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తద్వారా ప్రపంచానికి అవసరమైన ఏఐ అప్లికేషన్లను భారత్ నుండే అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
#BREAKING: India’s IT Minister Ashwini Vaishnaw at Davos strongly counters IMF Chief for calling India a second-tier AI power:
“I don't know what the IMF criteria is but Stanford places India at 3rd in the world for AI preparedness. I don't think your classification is correct.” pic.twitter.com/z0E5Q9pIWx
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 21, 2026