Ayodhya book: అయోధ్య రామమందిరానికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఇటీవల అయోధ్య రామయ్యకు ఓ భక్తుడు కానుకగా సమర్పించిన రూ. 5 కోట్ల విలువైన బంగారు పూత ‘రామ్చరిత్మానస్’ పుస్తకం కనిపించకుండా పోయిందనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. కోట్ల విలువైన ఈ అపురూప గ్రంథం మాయమైందంటూ జరిగిన ప్రచారంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఈ వివాదంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రంగంలోకి దిగి అసలు నిజం ఏంటో తేల్చేసింది.
మీడియా ముందుకు ‘బంగారు పుస్తకం’.. అవాస్తవాలకు చెక్!
పుస్తకం మాయమైందంటూ వస్తున్న ఆరోపణలను రామాలయ ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది. కేవలం ఖండించడమే కాకుండా, మీడియా ప్రతినిధులను పిలిపించి సదరు బంగారు పూత ‘రామ్చరిత్మానస్’ గ్రంథాన్ని వారి కళ్ల ముందే ప్రదర్శించింది. సురక్షితమైన భద్రత మధ్య ఉన్న ఈ పవిత్ర గ్రంథాన్ని చూపిస్తూ, ప్రచారంలో ఉన్నవన్నీ అబద్ధాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే భక్తులు సమర్పించిన మరికొన్ని అరుదైన, విలువైన ఆభరణాలను కూడా మీడియాకు చూపిస్తూ పుకార్లకు చెక్ పెట్టింది.
విరాళాల రక్షణకు ప్రత్యేక రిజిస్టర్..
రాముడికి దేశ విదేశాల నుంచి అందుతున్న కానుకల రక్షణపై ట్రస్ట్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. భక్తులు సమర్పించిన ప్రతి చిన్న వస్తువుకూ పక్కాగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు విరాళంగా వచ్చిన 2 వేలకు పైగా అరుదైన, విలువైన వస్తువుల కోసం ఒక ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. డిజిటల్ మరియు మాన్యువల్ పద్ధతుల్లో ఈ రికార్డులను అత్యంత పారదర్శకంగా భద్రపరుస్తున్నామని అధికారులు వివరించారు.
ట్రస్ట్ ఓపెన్ ఆఫర్!
స్వామివారి సొమ్ముకు ఎలాంటి డోకా లేదని, భక్తులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆభరణాలు, విరాళాల భద్రతపై ఎవరికైనా ఏవైనా సందేహాలు లేదా అనుమానాలు ఉంటే.. నేరుగా అయోధ్యలోని ట్రస్ట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది. రికార్డులను స్వయంగా సరిచూసుకునే అవకాశం కూడా ఉందని, పారదర్శకత విషయంలో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: పోలీసోడి పాడు బుద్ధి.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి డ్రైవర్కే కన్నం! ఖాకీ పవర్ చూపించినా వదలకుండా..!