Narasimha Reddy: భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు కొమ్మిడి నర్సింహారెడ్డి (83) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పరితపించిన ఒక గొప్ప నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడంతో భువనగిరి ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త విన్న రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్తో అనుబంధం..
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కొమ్మిడి నర్సింహారెడ్డి.. 1978, 1983 లలో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండుసార్లు భువనగిరి శాసనసభ్యుడిగా (MLA) ఎన్నికయ్యారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షానే నిలిచి పోరాటాలు చేయడం ఆయన నైజం. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను పీడించిన ప్రధాన మహమ్మారి ‘ఫ్లోరైడ్’ సమస్యపై ఆయన గళమెత్తారు. ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరగాలని, ఆ ప్రాంత ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందాలని క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీ వరకు ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మూడు వందల ఎకరాల భూదానం..
మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మానవత్వాన్ని చాటుకున్న అరుదైన నాయకుడు నర్సింహారెడ్డి. పేదరికంపై పోరాటంలో భాగంగా తన సొంత ఆస్తి అయిన దాదాపు 300 ఎకరాల భూమిని నిరుపేదలకు దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నేటి తరం రాజకీయాలకు ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయమైన పాఠం.
Also Read: సంజు శాంసన్ క్రైస్తవ మతస్థుడు..అందుకే టీమిండియా నుంచి పంపించేశారు!