
Kedarnath : కేదార్నాథ్ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గఢ్వాల్ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హిమపాతం పేరుకుపోయింది. ప్రతికూలవాతావరణ పరిస్థితుల కారణంగా రిషికేశ్, హరిద్వార్లలో యాత్రికులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు.
మంగళవారం నుంచి కేదార్నాథ్ ధామ్ తెరుచుకోనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్న భక్తులు తగిన జాగ్రత్తలతో చార్ధామ్ యాత్రకు రావాలని అధికారులు సూచించారు. వెచ్చదనాన్నిచ్చే దుస్తులను తప్పనిసరిగా తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.
మరోవైపు సెల్ఫీ పిచ్చి కేదార్నాథ్లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణం తీసింది. కేదార్నాథ్ ధామ్ హెలీప్యాడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థలో ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేస్తున్న జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం హెలీకాప్టర్తో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరగా వెళ్లారు. అయితే హెలీకాప్టర్ తోక భాగంలోని రెక్కలు తగిలి సైనీ తీవ్రగాయపడ్డారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు.