Bengaluru Reels Murder: భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు, సర్దుబాట్లు సహజం. కానీ, సోషల్ మీడియా వ్యామోహం, పట్టింపులు చివరకు ఒకరి ప్రాణాలనే తీసేంత దారుణానికి దారితీస్తున్నాయి. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ కిరాతక ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఉపాధి కోసం వచ్చి..
బిహార్కు చెందిన ధీరజ్ కుమార్ (24), రీమాకుమారి (20) పది నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. రీమాకుమారి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం పొందగా, ధీరజ్ చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.
రీల్స్ గొడవ.. ప్రాణం తీసిన కోపం
రీమాకుమారి ఖాళీ సమయంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటానికి బాగా అలవాటు పడింది. రోజూ పని ముగించుకుని ఇంటికొచ్చాక కూడా ఆమె ఫోన్లోనే మునిగిపోతుండటం, సకాలంలో వంట చేయకపోవడం, ఇంటి పనులు పట్టించుకోకపోవడంతో ధీరజ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ విషయమై రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే గత నెల 27న ఆవేశంతో రగిలిపోయిన ధీరజ్, రీమా గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
దుర్వాసనతో వెలుగులోకి..
హత్య అనంతరం మృతదేహాన్ని పరుపులో చుట్టివేసి, ఇంటికి తాళం వేసి బిహార్కు పారిపోయాడు. జులై 29న రీమా విధులకు రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితురాళ్లు ఇంటికి వెళ్లి చూశారు. లోపలి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది.
నిందితుడి అరెస్ట్
బెంగళూరు నైరుతి విభాగం డీసీపీ అనితా హద్దణ్ణనవర్ సమక్షంలో ప్రత్యేక పోలీస్ బృందం బిహార్ వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో ధీరజ్ తన నేరాన్ని అంగీకరిస్తూ.. ‘భార్య తీరు నచ్చలేదు, నిత్యం రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తుండటంతో విసిగిపోయి చంపేశా’ అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: 51 లక్షల లడ్డూతో బిగ్ ప్లాన్.. రూ. 4 కోట్లతో జంప్! మై హోమ్ భుజాలో అసలేం జరిగింది?