అసలు ఈ కేసు బయటికి రావడం నుంచి మొదలుపెడితే.. ఇప్పటి వరకు వరకు ప్రతి సీన్ ట్విస్టే. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే.. ప్రస్తుతం ఈ కేసులో అత్యంత ముఖ్యమైన ఎవిడెన్స్గా ఉన్న షీనాబోరా అస్థికలు మాయమయ్యాయి. అవును.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. షార్ట్గా సీబీఐ.. ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఇప్పుడీదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. దీంతో అందరి దిమ్మ తిరిగిపోయింది. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన సాక్ష్యాలుగా ఉన్న ఆ ఆధారాలు ఎలా మిస్సయ్యాయి? ఎందుకు మిస్సయ్యాయి? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎందుకంటే ఈ ఆధారాలు లేకపోతే ఈ కేసు ముందుకు వెళ్లే చాన్సేస్ చాలా తక్కువ.
అసలు ఏం జరిగిందో కాస్త పాస్ట్లోకి వెళదాం.. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె బాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్.. ఈ కేసులో అతి ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు.. ఏప్రిల్ 24, 2012లో వీరు ముగ్గురు కలిసి షీనా బోరాను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత రాయ్ఘడ్ జిల్లాలోని అడవిలో ఆమె మృతదేహాన్ని కాల్చేశారు. ఆ తర్వాత అంతా చేతులు దులుపుకున్నారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. లోకల్ పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించారు. కానీ ఈ డెడ్ బాడీ ఎవరిదో గుర్తించలేకపోయారు. దీంతో ఆ కేసును సాల్వ్ చేయలేకపోయారు.
కాని ఆగస్టు 21, 2015లో ఈ కేసు మళ్లీ హైలేట్ అయ్యింది. ఎందుకంటే.. అప్పటి ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ ఉన్నారుగా శ్యాంవర్ రాయ్.. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. అది వేరే కేసులో లేండి. కాని ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆల్ ఆఫ్ సడెన్గా షీనా బోరా మర్డర్ కేసు తెరపైకి వచ్చింది. 2012లో తాము చేసిన దారుణాన్ని దాచుకోకుండా కక్కేశాడు. దీంతో నేషనల్ వైడ్గా ఈ కేసు ఒక్కసారిగా హైలేట్ అయ్యింది. అదే ఏడాది సెప్టెంబర్ ఈ కేసులోకి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది.. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీని అరెస్ట్ చేసింది. ఈ విచారణలో షీనా బోరాను వాళ్లే హత్య చేసినట్టు తేలింది. అంతేకాదు.. పిటర్కు మరో భార్య వల్ల కలిగిన కొడుకైన రాహుల్తో షీనా బోరా రిలేషన్ షిప్లో ఉండటం నచ్చలేదు. అందుకే షీనాబోరాను హత్య చేసినట్టు తేల్చారు అధికారులు.
ఇక అప్పటి నుంచి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంద్రాణికి ఆరున్నరేళ్ల తర్వాత 2022లో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. కానీ ఇంకా కేసు ఎటూ తేమల్లేదు.
Also Read: లవర్స్ని కాపాడిన మత్య్సకారుడు, లాగి చెంపదెబ్బ కొట్టాడు..
నిజానికి ఈ కేసు ఇంత సంచలనం కావడానికి కారణం పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ.. ఎందుకంటే వీరు INX మీడియా అధిపతులు.. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ మీడియా ఓ సంచలనం. అందుకే దేశం మొత్తం ఈ కేసుపై కాన్సన్ ట్రేట్ చేసింది. అయితే షీనా బోరా మర్డర్ కేసులో ప్రతీది ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 24, 2012లో మర్డర్ జరిగితే.. మే 21 వరకు కానీ ఆ మృతదేహాన్ని గుర్తించలేదు. ఓ రైతు మామిడిపండ్ల కోసం వెళితే అక్కడో సూట్ కేస్ కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే కాలిపోయి.. కుళ్లిపోతున్న స్థితిలో ఉన్న మృతదేహం కనిపించింది. ఆ తర్వాత మూడేళ్లకు కానీ అది షీనా బోరా డెడ్ బాడీ అని గుర్తించలేకపోయారు. ఇప్పుడు కూడా ఈ కేసు విచారణ ముగియలేదు. ఇక లెటెస్ట్గా షీనా బోరాకు సంబంధించిన అస్థికలు మొత్తం మాయమయ్యాయి. దీంతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అయితే మంచికో.. చెడుకో తెలియదు కానీ కొన్ని పరిణామాలు జరిగాయి. పీటర్ ముఖర్జీకి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదని విచారించి వదిలేశారు. ఆయన జైలులో ఉన్న ఇంద్రాణితో విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఆస్థికలు షీనా బోరావే అని. సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ గతంలోనే నిర్ధారించారు. అయితే మరోసారి ఆ ఆస్థికలను ఆ డాక్టర్స్కు చూపించి విచారించాలని లాయర్ కోరారు. దీంతో ఈ అస్థికలు మిస్సైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇంద్రాణి తరపు లాయర్లకు మరో అస్త్రం దొరికినట్టైంది.
అస్థికలు లేకున్నా విచారణ కంటిన్యూ చేయవచ్చు అని సీబీఐ చెబుతుంది. అలా ఎలా చేస్తారంటూ ఇంద్రాణి తరపు లాయర్లు వాదిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జూన్ 27కు విచారణను వాయిదా వేసింది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అస్థికల అవసరమా? అనవసరమా? అనేది నిర్ణయిస్తుందా? అస్థికల మాయం ఇంద్రాణికి ప్లస్ అవుతుందా? లేదా? ఈ ప్రశ్నలకు జూన్ 27న సమాధానం రానుంది. కానీ ఒకటి మాత్రం చెప్పవచ్చు.. షీనా బోరా మర్డర్ కేస్ మాత్రం ఇప్పట్లో తేలే అంశం కాదన్నది మాత్రం క్లియర్.