Union Cabinet Decisions: ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థాలో నిర్వహించిన మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రజల్లో మోదీ ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వాసం మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఆ రాష్ట్రం పేరును ‘కేరళమ్’గా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు త్వరలోనే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
రైల్వే రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు క్యాబినెట్ పెద్దపీట వేసింది. మూడు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. గోండియా-జబల్పూర్ మధ్య 231 కిలోమీటర్ల మేర డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. రూ. 5,236 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా పునరఖ్-కియుల్ మధ్య 3వ 4వ రైల్వే లైన్ల కోసం రూ. 2,668 కోట్లు కేటాయించారు. గమ్హారియా-చండిల్ మధ్య 3వ 4వ లైన్ల నిర్మాణానికి రూ. 1,168 కోట్లు మంజూరు చేశారు.
వాయు రవాణా రంగంలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో నూతన ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. రూ. 1,667 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భవనం పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించనుంది. పట్టణ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2B విస్తరణకు రూ. 1,067 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విస్తరణతో నగర ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గి ప్రయాణం మరింత సులభతరం కానుంది.
వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ జనపనార కనీస మద్దతు ధర (MSP) కోసం రూ. 430 కోట్లు కేటాయించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాష్ట్రాల ఆకాంక్షలను గౌరవిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి. రవాణా కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: CM Revanth Reddy: పంచాయితీలు వద్దు.. సామరస్యమే ముద్దు.. దేవాదుల సాక్షిగా సీఎం రేవంత్ సంచలన ట్వీట్