Paidi Rakesh Reddy: కామారెడ్డి జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ నిర్వహనలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని.. అధికారం చేపట్టాక కేవలం తన స్వంత నియోజకవర్గమైన కొడంగల్పైనే ప్రేమ చూపిస్తున్నారని రాకేష్ రెడ్డి విమర్శించారు. కొడంగల్కు సుమారు 10 వేల కోట్లు తరలించుకుపోయారని.. తనను ఓడించిన కామారెడ్డి ప్రజలపై కక్ష గట్టి ఇక్కడ అభివృద్ధిని కుంటుపరుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పాలన పూర్తిగా గాడి తప్పిందని.. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు తగ్గించి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘నీ స్థానంలో ఎవరున్నా ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ బావిలో దూకి చనిపోయేవారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏడుసార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీని అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. షబ్బీర్ అలీ వెనుక రోహింగ్యా ముస్లింలు ఉన్నారని.. దీనిపై వెంటనే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. షబ్బీర్ అలీ కామారెడ్డికి ‘కట్టప్ప’లా మారారని ఎద్దేవా చేస్తూ.. దేశంలో ఉండటం ఇష్టం లేకపోతే సౌదీ వెళ్లాలని, కావాలంటే తానే వీసా ఇప్పిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నాయకులు వీరులని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడుతారని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ‘వచ్చే ఎన్నికల్లో 80 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని, సచివాలయంపై కాషాయ జెండా ఎగురవేస్తాం’అని ధీమా వ్యక్తం చేశారు. హిందువులను అవమానించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని.. చిల్లర మాటలు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండా మంత్రి సీతక్క సమావేశాలు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజా మన్ననలతో గెలిచిన తమను తక్కువ అంచనా వేయవద్దని.. అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. అవినీతితో సీఎం అయ్యారని.. గత ముఖ్యమంత్రిలాగే రేవంత్ రెడ్డికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదని జోస్యం చెప్పారు.
Also Read: హర్యానా నెంబర్ ప్లేటుతో మారుతి కారు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!