OTT: కరోనా లాక్డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఆదరణ పెరిగింది. థియేటర్లన్నీ నెలల తరబడి క్లోజ్ చేయడంతో సినీప్రియులంతా ఓటీటీల బాట పట్టారు. ఇప్పటికీ ఓటీటీలకు ఆ క్రేజ్ కొనసాగుతోంది. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ఈక్రమంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.
మరోవైపు రోజురోజుకు ఓటీటీలో బోల్డ్, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్ పెరుగుతోంది. ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు, వెబ్సిరీస్లకు సెన్సార్ పర్మిషన్ అవసరం లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా బోల్డ్ కంటెంట్తో కూడిన సినిమాలను ఎక్కువ తీస్తున్నారు. ఇటీవల విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్లో వచ్చిన రానా నాయుడు వెబ్సిరీస్లో కూడా బోల్డ్ కంటెంట్ మితిమీరిపోయింది. ఈ సిరీస్పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్ పెరుగుతుండడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఓటీటీలకు స్వేచ్ఛ ఇచ్చింది క్రియేటివిటీ కోసమని.. అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని వెల్లడించారు. మరోసారి ఎవరైనా పరిమితి దాటితే జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.