NTA Overhaul: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై తీవ్ర విమర్శలు, వివాదాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా NTA నుంచి ఏకంగా 47 మంది అధికారులను తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారులపై లీగల్, క్రిమినల్ చర్యలు
కేవలం ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా, బాధ్యులైన సదరు 47 మంది అధికారులపై తీవ్రమైన లీగల్, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు, నిర్లక్ష్యంపై ప్రాథమిక సమాచారం ఆధారంగా వీరిని గుర్తించినట్లు తెలుస్తోంది. కొందరిపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు ప్రారంభించగా, తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారిని సస్పెండ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సమూల మార్పుల దిశగా కేంద్రం కసరత్తు
జేఈఈ , నీట్ , సీయూఈటీ సహా దేశవ్యాప్తంగా 15 నుంచి 20 కీలక జాతీయ స్థాయి పరీక్షలను ఈ NTAనే నిర్వహిస్తోంది. అయితే వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలు, సాంకేతిక లోపాలు వెలుగుచూడటంతో పరీక్షా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సడలిపోయింది. ఈ నేపథ్యంలో వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు, భవిష్యత్తులో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేని విధంగా ‘ఫూల్ప్రూఫ్’ రోడ్మ్యాప్ను కేంద్రం సిద్ధం చేస్తోంది.
వచ్చే నెలలో NTA పునర్వ్యవస్థీకరణ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన కీలక సిఫారసుల ఆధారంగానే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నారు. NTA నిర్మాణంలో సమూల మార్పులు తెస్తూ, వచ్చే నెలలోనే పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్న అవుట్సోర్సింగ్ విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చి, అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. NTA నిర్మాణాత్మక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరికాసేపట్లో అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించనుంది.
Also Read: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు ఎండ్కార్డ్.. సీఎం రేవంత్ బిగ్ మాస్టర్ ప్లాన్!