Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలో అడుగుపెడితే చాలు.. ఎటు చూసినా కిక్కిరిసిన వాహనాలు, గంటల తరబడి సాగే ట్రాఫిక్ నరకం ప్రతి ఒక్కరికీ అనుభవమే. రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి కసరత్తే మొదలుపెట్టింది. నగర రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
సీఎం రేవంత్ సీమీక్ష
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణారావులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక బ్యూరో ఏర్పాటుకు నిర్ణయం
ట్రాఫిక్ సమస్యలను కేవలం తాత్కాలికంగా కాకుండా, శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు ‘ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీని సంస్థాగత నిర్మాణంపై పూర్తి అధ్యయనం చేసి, పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ బ్యూరో పనితీరుపై ప్రతి రెండు మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
నిబంధనల కంటే క్రమబద్ధీకరణే కీలకం
వాహనదారులపై కేవలం జరిమానాలు వేయడమే కాకుండా, రోడ్లపై ట్రాఫిక్ సులువుగా సాగిపోయేలా చూడటమే ముఖ్యమని సీఎం అధికారులకు సూచించారు. నగరంలో సిగ్నల్స్ దగ్గర వాహనాలు గంటల తరబడి ఆగిపోకుండా ‘సిగ్నల్ ఫ్రీ’ వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు. దీనికోసం అవసరమైన కీలక ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని చెప్పారు. వాతావరణ మార్పులు, కార్యాలయాల వేళలు, రద్దీ సమయాలు , స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
Also Read: బళ్లారి–గుంతకల్ రూట్లో 3, 4వ రైల్వే లైన్లు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక నిఘా
నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై వరసగా జరుగుతున్న ప్రమాదాల పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఔటర్ రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయకుండా నిరంతరం రోడ్డు భద్రతా బృందాలు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఏదైనా కొత్త ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించే ముందు అక్కడ ట్రాఫిక్ రద్దీపై ముందస్తు అధ్యయనం చేయడం తప్పనిసరి అని తేల్చి చెప్పారు.
ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా చర్యలపై MCRHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు… pic.twitter.com/bwKN8GoGiS
— BIG TV Breaking News (@bigtvtelugu) July 24, 2026