Chhattisgarh Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెమెతర హైవేపై ఆగిఉన్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా.. 10 మంది మరణించారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను రాయ్ పూర్ ఎయిమ్స్ కు తరలించి చికిత్స చేస్తున్నారు.
మృతులు, క్షతగాత్రులంతా తిరయ్య గ్రామంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లొస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు.. హైవేపై ఆగి ఉన్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. కర్ణాటకలో జరిగిన రథం ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయపుర జిల్లాలో లచ్యన గ్రామంలో ఆదివారం ఓ ఆలయం వద్ద రథోత్సవ కార్యక్రమం జరిగింది. ఉత్సవంలో ఇద్దరు వ్యక్తులు రథ చక్రాల కిందపడి మరణించారు. మృతులు బందు కటకదొండ (35), సోబు షిండే (55)గా గుర్తించారు. గ్రామంలోని ఆరాధ్యదైవం శ్రీ సిద్దలింగ మహారాజుకు చెందిన రథాన్ని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. తొక్కిసలాట జరగడంతో కొందరు రథచక్రాల కింద నలిగిపోయారు. ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.