Karnataka Assembly : కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ సభ్యులు చెవిలో పూలు పెట్టుకుని వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరికొందరు కాంగ్రెస్ సభ్యులు చెవిలో పూలు పెట్టుకుని సభకు హాజరయ్యారు.
త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కర్నాటకలో ఆర్థికశాఖను సీఎం బసవరాజ్ బొమ్మైనే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బొమ్మై అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ నేతలు పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రజల చెవిలో పూలు పెడుతోందని విపక్ష సభ్యులు విమర్శించారు. గతేడాది బడ్జెట్ లో ప్రతిపాదించిన నిధులు సరిగ్గా ఖర్చు చేయలేదని ఆరోపించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
కర్నాటక అసెంబ్లీ 224 స్థానాలున్నాయి. మరో రెండుమూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ- కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య ఒకరిపైఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. గత బడ్జెట్లో ప్రతిపాదించిన హామీల్లో 10 శాతం మాత్రమే అమలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర అప్పులు రూ.3 లక్షల కోట్లు దాటాయని సిద్ధరామయ్య ఆరోపించారు. సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలోనే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బొమ్మై ఎదురుదాడి చేశారు. కర్ణాటక చరిత్రలోనే ఆయన గరిష్ఠంగా అప్పులు చేశారంటూ విరుచుకుపడ్డారు. 2023-24 ఏడాదికి తాము ప్రవేశపెట్టేది మిగులు బడ్జెట్ అని వెల్లడించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా రాజకీయం మరింత హీటెక్కింది.