Indigo: ఇండిగో విమాన సేవల అంతరాయంతో దేశం వ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించింది. నిర్వహణ లోపాల కారణంగా వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవ్వడంపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది.
ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులపై దుమారం రేగింది. ఇండిగోకు మినహాయింపులు ఇవ్వడంపై పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కావాలనే ఇండిగో నిర్లక్ష్యం వహించిందని పైలట్స్ అసోసియేషన్ పేర్కొంది. 2024 జనవరిలోనే డీజీసీఏ కొత్త నిబంధనలు ప్రకటించిందని తెలిపింది. అయినా సరిపడా పైలట్లను ఇండిగో ఏర్పాటు చేసుకోలేదని ఆరోపించింది. డీజీసీఏ వారాంతపు విశ్రాంతిని సడలించడం వల్ల పైలట్లకు సరైన విశ్రాంతి ఉండదని పైలట్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దాని వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిపింది.