Modi: ప్రధాని మోదీ. గతంలో చాయ్వాలా. తాను రైల్వే స్టేషన్లో టీ అమ్మానంటూ ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. బీజేపీలో చాయ్వాలా కూడా ప్రధాని కాగలరని ఘనంగా చాటుకున్నారు. అయితే, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం మోదీ.. డిగ్రీ చదివినట్టు ఉంది. ఇదే పాయింట్ను పట్టుకుని పొలిటికల్గా మోదీని కార్నర్ చేస్తున్నారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. మోదీ సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల్లోనూ డౌట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు.
మోడీకి సంబంధించిన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను పీఎంవో బహిర్గతం చేయాలంటూ గతంలో గుజరాత్ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అయితే, పీఎంవో మోదీ సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదంటూ తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ప్రధాని మోదీ డిగ్రీపై మరిన్ని అనుమానాలు పెరిగాయంటూ కేజ్రీవాల్ మళ్లీ అటాక్ స్టార్ట్ చేశారు. మోదీ నిజంగానే డిగ్రీ చదివి ఉంటే.. వాటిని ఎందుకు చూపించడం లేదంటూ నిలదీస్తున్నారు.
ప్రధాని పోస్టులో ఉన్న వ్యక్తికి విద్యాబుద్ధులు ఉండటం చాలా ముఖ్యమని.. ప్రతిరోజు అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని.. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న వారిలో చాలామంది చదువురాని వారేనంటూ ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ పెద్దలను బాగా బద్నామ్ చేస్తున్నారు ఢిల్లీ సీఎం.
అటు, సోషల్ మీడియాలోనూ మోదీ సర్టిఫికెట్లపై చర్చ, రచ్చ నడుస్తోంది. మోదీది వాట్సాప్ యూనివర్సిటీ కావొచ్చు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ సైతం స్పందించడంతో మరో మలుపు తిరిగింది. తాను పూణే యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశానంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. కావాలంటే ఈ రెండు సర్టిఫికెట్లను తాను పబ్లిక్ గా చేర్ చేయగలనంటూ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్తో మరింత మంట రాజుకుంది. పలువురు నెటిజన్లు ఇదిగో మా సర్టిఫికెట్లు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా ఒకరి తర్వాత ఒకరు.. తమ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ షేర్ చేస్తూ ఇదో ట్రెండ్గా మార్చేశారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే.. మోదీ సర్టిఫికెట్లపై జనాలకు లేని సందేహం మొదలైంది. మోదీ నిజంగా డిగ్రీ చదివారా? చదివుంటే సర్టిఫికెట్లు చూపించడానికి ఏంటి ప్రాబ్లమ్? చూపించడం లేదంటే డిగ్రీ చదవలేదనేనా అర్థం? ఇంతకీ చాయ్వాలా.. పెద్ద చదువులు ఎప్పుడు, ఎలా చదవగలిగారు? ఇలా లేనిపోని డౌట్స్తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వాట్సాప్ యూనివర్సీటీలో చదివుంటారు అంటూ సెటైర్లు కూడా బాగా పడుతున్నాయి. మొత్తానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కదిపిన కంప.. ఇప్పుడిలా మోదీకి తగులుకుంది.