Corona Virus : వెయ్యికి పైగా కేసులు. ఏడు మరణాలు. ఇండియాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఏం కాదులే.. భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. కానీ, పెరుగుతున్న కేసులు, చనిపోతున్న వారి సంఖ్య చూస్తుంటే హడలిపోక తప్పడం లేదు. మొన్ననే హాంకాంగ్, సింగపూర్లో కొవిడ్ అన్నారు. అంతలోనే భారత్లో ఎంటర్ అయిపోయింది. అవునా, అనుకునేలోగా లెక్క పెరిగిపోతోంది. ఒకటి, రెండు.. పది, ఇరవై.. వందా దాటేసి.. వెయ్యి మార్క్ టచ్ చేసింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1009 అని అధికారిక లెక్క. ఇక అనధికారి సంఖ్య చాలానే ఉంటుంది. ఒక్క వారంలోనే ఇంతగా పెరిగిపోయాయి కేసులు. అంటే.. మళ్లీ పాత రోజులు వస్తున్నట్టేనా?
ఎక్కడెక్కడ ఎన్ని కేసులంటే..
430 కేసులతో ఈసారి కూడా కేరళనే టాప్లో ఉంది. ముంబై సెకండ్ ప్లేస్. మహారాష్ట్రలో డబుల్ సెంచరీ, ఢిల్లీలో సెంచరీ కొట్టేసింది కరోనా. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలే కాస్త బెటర్ అనిపిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 4 కేసులు నమోదవగా.. తెలంగాణలో ఒక్క కేసు ఉంది. కరోనా లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకైతే పాజిటివ్ కేసులు లేవు. అండమాన్ నికోబార్లో కూడా అడుగుపెట్టలేకపోయింది కరోనా వైరస్.
ఏడుగురు మృతి..
ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనాతో ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్ కారణంతో మరణించారు. దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు.. ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. భయపడాల్సిన పని లేదంటూనే.. సున్నితంగా అలర్ట్ చేస్తున్నారు. మాస్కులు తప్పనిసరి.. పరిశుభ్రత అతిముఖ్యం.. మంచి ఆహారం తీసుకోవాలి.. అని చెబుతున్నారు.
ఆనాటి టీకాల వల్లే..
కొవిడ్ 19 టైమ్లో దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేయటం వల్లనే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్లకే ఇప్పుడు వైరస్ ఎటాక్ అవుతోందని.. అయినా, పెద్దగా ప్రభావం చూపించటం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఆ రెండు వేరియంట్స్తోనే..
ఆసియా దేశాల్లో ఇప్పటికీ కొవిడ్ వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉప రకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందనేది పరిశోధనల సారాంశం.
సర్కారు రివ్యూ..
కొవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యునిటీ వచ్చినందున అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు. పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల, కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటివరకూ ఎటువంటి అడ్వైజరీ, గైడ్లైన్స్ విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు. మరోవైపు, కొవిడ్పై నిరంతరం నిఘా కొనసాగించాలని.. ప్రజలకు అవగాహన కల్పించాలని.. అధికారులను ఆదేశించారు మంత్రి రాజనర్సింహ. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సాంపిల్స్ పంపించాలని సమావేశంలో నిర్ణయించారు.