Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై రాజకీయ దుమారం తారాస్థాయికి చేరింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని సంచలన లేఖ రాశారు. ఏకంగా 15 పేజీల నిడివి గల ఈ లేఖలో.. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న విషపూరిత వాతావరణానికి కేజ్రీవాల్ 11 ఏళ్ల పాలనే కారణమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరిగిందని ఎల్జీ సక్సేనా ఆరోపించారు. గత 11 ఏళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పటికీ, కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారాలు చూపడంలో ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. “మీ పాలనలో ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్గా మారింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా గగనమైపోయింది. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?” అని లేఖలో ఎల్జీ ప్రశ్నించారు.
గతంలో పంజాబ్లో పంట వ్యర్థాలు కాల్చడం (Stubble Burning) వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించేవారని, కానీ ఇప్పుడు పంజాబ్లో ఆప్ ప్రభుత్వమే ఉన్నా పరిస్థితి ఎందుకు మారలేదని ఎల్జీ నిలదీశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పొరుగు రాష్ట్రాలపై నెపం నెట్టడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం తగదని హితవు పలికారు. యమునా నది ప్రక్షాళన విషయంలోనూ కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని, నది మురికి కూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత కాలుష్య సంక్షోభం కేవలం భౌగోళిక లేదా వాతావరణ సమస్య కాదని, ఇది ముమ్మాటికీ కేజ్రీవాల్ ప్రభుత్వ పాలనా వైఫల్యమేనని ఎల్జీ స్పష్టం చేశారు. శీతాకాలం వచ్చినప్పుడు హడావిడి చేయడం మినహా, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయలేదని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఘాటుగా విమర్శించారు. ఎల్జీ లేఖతో ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఫ్రీ