H-1B Visa: హెచ్-1బీ వీసాపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం భారతీయులను ఓ కుదుపు కుదిపేసింది. చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. వీసా రుసుము ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటనతో అమెరికాలోని ప్రవాస భారతీయులకు టెన్షన్ మొదలైంది. ఈ కొత్త నిబంధన ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ క్రమంలో భారత్కు వచ్చినవారు ఎకాఎకీన అమెరికాకు పయనం అయ్యారు. దీంతో శంషాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై ఎయిర్పోర్టుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
హెచ్ 1 బీ వీసా దారులు వెంటనే అమెరికాకు రావాలని అమెరికాలోని పలు కంపెనీలు అడ్వైజరీని జారీ చేశాయి. వెంటనే ఉన్నపళంగా రాత్రికి రాత్రి అమెరికాకు పయన మయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కొందరు మార్గ మధ్యలో సమాచారం అందడంతో తమ ప్రయాణాలను మార్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అప్పటికే విమానాలు ఎక్కినవారు కిందికి దిగిపోయారు. ఈ క్రమంలో శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టులో ఎమిరేట్స్ విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
ట్రంప్ ప్రకటన తెలియగానే దుబాయ్ విమానాశ్రయంలో 10 నిమిషాల వ్యవధిలో 20 మంది భారత్ ప్రయాణికులు విమానం దిగిపోయారు. అక్కడి నుంచే మళ్లీ యూఎస్కు ప్రయాణమయ్యారు. ఇప్పటికే భారత్కు చేరుకున్నవారు ఉన్నపళంగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టెక్కీలు శనివారం ఉదయం నుంచి అమెరికాకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ఎయిర్ పోర్టులను ఎంచుకున్నారు. ఇక హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెలెస్కు, హైదరాబాద్ నుంచి డాలస్కు విమాన టికెట్ల ధరలు అమాంతంగా పెరిగాయి.
ట్రంప్ ప్రకటన వెలువడిన రెండు గంటల్లో న్యూఢిల్లీ నుండి న్యూయార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వన్ వే టికెట్ ధర దాదాపు 37 వేల నుండి 80 వేలకు పెరిగింది. హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెలెస్కు టికెట్ ధర రూ.1.32 లక్షలు, అమెరికా నుంచి డాలస్కు రూ.80వేల నుంచి రూ.90వేల వరకు చెల్లించారు. గడువులోగా అమెరికా చేరుకోవాలనే ఉద్దేశంతో అధిక ధర చెల్లించి విమానం ఎక్కారు టెక్కీలు. వెళ్తున్న వీరికి వీడ్కోలు చెప్పేందుకు కుటుంబసభ్యులు రావడంతో పలు విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి.
ALSO READ: హెచ్-1బీ వీసా రుసుం పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏంటి?
దసరా, దీపావళి వరుసగా పండుగల నేపథ్యంలో భారత్కు రావాలని చాలామంది టెక్కీలు రెడీ అయ్యారు. దీనికితోడు వివాహాలు చేసుకోవాల్సినవారు, బంధువుల శుభకార్యాలకు హాజరయ్యేందుకు మరికొందరు తమ తమ ప్రయాణాలను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా దాటితే వీసాకు లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ ప్రకటనపై మెక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, అమెరికా, ఆపిల్ వంటి అనేక టెక్ సంస్థలు స్పందించాయి. అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం అర్థరాత్రి నుండి కొత్త నిర్ణయం అమల్లోకి రానుండడంతో యుఎస్ వెలుపలున్న హెచ్-1బి వీసా దారులు శనివారం అర్ధరాత్రికి తిరిగి రావాలని, మరికొందరు యుఎస్లోనే ఉండాలని ఆయా కంపెనీలు సలహా ఇచ్చాయి. దీంతో శనివారం ఉదయం నుండి అమెరికాకు చివరి నిమిషంలో విమాన టికెట్ల బుకింగ్లో గణనీయమైన పెరుగుదల కనిపించిందని మేక్ మైట్రిప్ ప్రతినిధి తెలిపారు.