H-1B Visas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఐటీ, ఇంజినీరింగ్ కంపెనీలు తమ ఉద్యోగులు అమెరికాలో పనిచేసేందుకు ఇచ్చే హెచ్-1బీ వీసాల ఫీజులను లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. తమ ఉద్యోగులను 24 గంటల్లో యూఎస్ వచ్చేయాలని కోరుతున్నాయి. ట్రంప్ నిర్ణయం భారత టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) తెలిపింది.
తాజా పరిణామాలు ఆఫ్షోర్ ప్రాజెక్టులకు అంతరాయం కలిగిస్తుందని నాస్కామ్ తెలిపింది. 24 గంటల్లో హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయం అమలు చేస్తున్నట్లు చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు, ఐటీ నిపుణుల్లో ఆందోళన నెలకొంది. ఈ ధోరణి అమెరికా ఆవిష్కరణల వ్యవస్థతో పాటు ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని నాస్కామ్ తెలిపింది. భారత కంపెనీల కోసం అమెరికాలో పనిచేస్తున్న భారతీయులపై కూడా ఈ ప్రభావం ఉంటుందని నాస్కామ్ వెల్లడించింది.
H-1B వీసా హోల్డర్లు లేదా ప్రస్తుతం అమెరికా వెలుపల పని చేస్తున్నవారు రాబోయే 24 గంటల్లో తిరిగి రావాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. జూన్, 2025 నాటికి అమెజాన్లో 10,044 మంది ఉద్యోగులు H-1B వీసాలను ఉపయోగిస్తున్నారు. TCS 5,505 H-1B వీసాలతో రెండో స్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) హెచ్-1బీ వీసాలు జారీ చేశాయి. H-1B వీసాదారుల్లో 78% కంటే ఎక్కువ మంది భారతదేశానికి చెందిన వారే ఉన్నారు.
Also Read: UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్
హెచ్-1బీ వీసా ఫీజు సాధారణంగా 2 వేల నుంచి 5 వేల డాలర్లుగా ఉంటుంది. అయితే దీన్ని ప్రస్తుతం లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసాలపై భారత్ కు చెందిన ఐటీ నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం భారత్ టెక్ కంపెనీలతో పాటు, అమెరికాలో పనిచేసే భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యుత్తమ ఉద్యోగుల కోసమే హెచ్-1బీ వీసాలు జారీ చేస్తామని అమెరికా చెబుతోంది.