Rajya Sabha Elections 2024 Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థికి సమానమైన ఓట్లు రాగా లక్కీ డ్రా ద్వారా బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.
మొత్తం 68 సీట్లు ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ 40 సీట్లు గెల్చుకోగా.. బీజేపీకి 25 సీట్లు గెల్చుకుంది. ఇండిపెండెంట్ సభ్యులు ముగ్గురున్నారు. కాగా హిమాచల్లో రాజ్యసభ అభ్యర్థి గెలవాలంటే మొత్తం 35 ఓట్లు కావాలి. కానీ కాంగ్రెస్, బీజేపీకి చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా విజేతను నిర్ణయించారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి ఓటు వేశారు.
“భారీ మెజారిటీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ రాజ్యసభ సీటును కోల్పోయింది. నేను హర్ష్ మహాజన్ను అభినందిస్తున్నాను” అని బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అన్నారు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయాన్ని నమోదు చేయగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించగలిగింది.
Read More: Kamal Nath: ‘నేను చెప్పానా..?’ బీజేపీలో చేరికపై కమల్ నాథ్ స్పందన..
మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, జిసి చంద్రశేఖర్ విజయం సాధించారు.
అజయ్ మాకెన్కు 47 ఓట్లు రాగా, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, జిసి చంద్రశేఖర్లకు చెరో 46 ఓట్లు వచ్చాయి.
“కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్నారు. ఓటర్లందరికీ, సీఎం, పార్టీ కార్యకర్తలకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.