దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాత్రం ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కొవిడ్ వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదమేం లేదన్నారు ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్. కొత్త వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. కేసుల పెరుగుతలపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాస సమస్యలు రాకుండా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.. ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకితే మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్నవారు, తమకు తాము క్వారంటైన్ లో ఉండాలని, ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వెయ్యి కేసులకు పైగా..
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1009గా తేలింది. వారం రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య బారీగా పెరిగింది. కొత్తగా 750 మందికి కొవిడ్ సోకింది. యాక్టివ్ కేసుల విషయంలో ఈసారి కూడా కేరళ టాప్ ప్లేస్ లో ఉంది. కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 209 కేసులు నమోదు కాగా.. ఢిల్లీ తాజాగా సెంచరీ దాటేసింది. ఢిల్లీలో ప్రస్తుతం 104 యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్, తమిళనాడు, కర్నాటక, యూపీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, తెలంగాణలో కూడా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మాత్రం కేసులపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
కేరళలో ఎక్కువ..
కొవిడ్ లో ప్రస్తుతం కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్, థాయిల్యాండ్, చైనా తదితర దేశాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో మాత్రం కాస్త ఆలస్యంగా కొవిడ్ కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈసారి కూడా కేరళ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం ఆందోళన కలిగించే అంశమే అయినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం భయాందోళనలకు గురికావొద్దని చెబుతోంది. కేసుల తీవ్రత ఎక్కువ అయినా కూడా.. కొత్త వేరియంట్, రోగులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అంటున్నారు అధికారులు. కొత్తగా కొవిడ్ సోకినవారు త్వరగానే కోలుకుంటున్నారని, ఐసీయూకి వెళ్లాల్సిన పరిస్థితులు దాదాపుగా లేవంటున్నారు. అదే సమయంలో ప్రతి జిల్లా కేంద్రంలో కొవిడ్ వార్డులు సిద్ధం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కార్యాలయాల్లో కూడా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొందరు పౌరులు స్వచ్ఛందంగా మాస్క్ లు ధరిస్తున్నారు.
కొత్త వేరియంట్లు..
తాజాగా వ్యాపిస్తున్న వేరియంట్.. JN-1 దాని సబ్ వేరియంట్స్ అని తెలుస్తోంది. JN-1 సబ్ వేరియంట్స్ అయిన LF-7, NB-1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ సహజ లక్షణాలైన.. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. అయితే బాధితులు సరైన చికిత్స తీసుకుంటే నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చ ెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్లే భారత్ లో కూడా వ్యాపిస్తున్నాయి.