India Corona : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్రం ముందు జాగ్రత్త చర్యగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజలందరూ మాస్క్ ధరించాలని నిబంధనలను జారీ చేసింది. భారత్లో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్లో కేసులు విజృంభిస్తున్నాయి. చైనాలో కరోనా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి మార్చురీల్లో డెడ్బాడీలు పెట్టడానికి స్థలం లేక బయటే బాడీలను పెట్టిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం దేశంలోని కరోనాను ఎదుర్కొనడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత్లో కరోనా తీవ్రతను తగ్గించడానికి, చర్యలు తీసుకొనడానికి ప్రతీ వారం కేంద్ర మంత్రి అధ్యక్షతన ప్రత్యేక భేటీ జరుగుతుంది. ఈ మీటింగ్లో కరోనాను అరికట్టేందుకు అన్ని నిర్ణయాలను తీసుకుంటారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ఇంకా ముగిసిపోలేదని.. అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. కరోనా మహమ్మరి కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. ఈ కొత్త వేరియంట్లను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన కమిటీ నిర్ణయానికి వచ్చింది.
భారత్లో ఇప్పుడు కరోనా కేసులు భయాందోళన కలిగించే స్థాయిలో లేవు. ప్రస్తుతం కేవలం 4వేల యాక్టివ్ పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ..చైనా, అమెరికా, దక్షిణాఫ్రికా, జపాన్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో మొత్తం కరోనా కేసులు 10 కోట్లు దాటాయంటే తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.